ఏపీ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కాపు నేస్తం పథకాన్ని అమలు చేసింది. అర్హులైన 3 లక్షల 27 వేల 244 మంది మహిళల ఖాతాల్లో రూ.490.86 కోట్లు జమయ్యాయి. సీఎం జగన్ ఈ నిధులను విడుదల చేశారు. ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఈ నిధులు జమ అయ్యాయి. ప్రభుత్వం జమ చేసిన నగదును బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా.. అన్ ఇన్ కమ్ బర్డ్ అకౌంట్లలో జమ చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ఈ నిధులను విడుదల చేశారు.


కాపు నేస్తం నిధుల విడుదల సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. 'నిరుపేద కాపు మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు 'వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం' అందిస్తున్నాం. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఆర్థిక సాయం అందుతోంది. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయం, ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయం చేస్తున్నాం. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం.' అని సీఎం జగన్ చెప్పారు.


ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పకపోయినా 'వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం'కు శ్రీకారం చుట్టామని జగన్ చెప్పుకొచ్చారు. కిందటి ప్రభుత్వం చెప్పిందేంటి.. చేసిందేంటి.. అని ఓ సారి గుర్తు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి సంవత్సరం 1,500 కోట్లు ఇస్తామని చెప్పి.. కనీసం ఏడాదికి రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజలను మోసం చేశారని విమర్శించారు. వరుసగా రెండో ఏడాది కూడా కాపు నేస్తం నిధులను విడుదల చేశామని జగన్ చెప్పారు. 3.27 లక్షల మంది లబ్ధిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నామన్నారు. అర్హత ఉన్నవారు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాత బకాయిలకు కాపు నేస్తం నగదు జమ చేసుకోకూడదని బ్యాంకులకు సూచించామన్నారు. రెండేళ్లలో కాపునేస్తం ద్వారా రూ.982 కోట్ల జమ చేసినట్లు జగన్‌ తెలిపారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందన్నారు. 


కొన్ని రోజులుగా కాపు నేస్తంపై రాష్ట్ర ప్రభుత్వం సర్వే జరిపింది. వార్డు వాలంటీర్లు అర్హులకు సంబంధించిన వివరాలను సేకరించారు. సచివాలయాల్లో అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం తుదిజాబితాకు ప్రభుత్వం ఆమోదం  తెలిపింది. అలా మెుత్తం 3.27 లక్షల మంది అర్హులకు నగదు జమ అయింది. నగదు అకౌంట్ లో పడినట్లు మహిళల ఫోన్లకే మెసేజ్ వెళ్లనుంది. ఒకవేళ ఏదైనా అనుమానాలు ఉంటే.. బ్యాంకుకు వెళ్లి కూడా.. డబ్బులు జమ అయ్యాయో.. లేదో.. చూసుకోవచ్చు.


 


Related Video: YSR Kapu Nestham: 3.27 లక్షల మంది ఖాతాల్లోకి.. రూ.490.86 కోట్లు విడుదల