ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం త్వరలోనే తీపికబురు చెప్పనుంది. ఈ మేరకు పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇటీవల పోలీస్ శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో పోలీస్ శాఖలో ఖాళీలు, రాష్ట్ర అవసరాలు, కొత్త జిల్లాల తర్వాత అవసరమైన అదనపు పోస్టుల భర్తీపై చర్చించారు.


ఖాళీలకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ శాఖ సమాచారం సేకరించి రాష్ట్రంలో మొత్తం 26,431 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.


అయితే దశలవారీగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. తొలిదశలో 6,500 ఉద్యోగాలకు ఈ ఏడాదే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలున్నాయి. మిగతా పోస్టులను దశలవారీగా భర్తీ చేయనున్నారు. అయితే ఏ విభాగంలో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పోలీస్ శాఖ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తొలుత నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.


కానిస్టేబుల్ కేటగిరీలు..


SCT పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) (పురుషులు & మహిళలు)


SCT పోలీస్ కానిస్టేబుల్ (AR) (పురుషులు & మహిళలు)


SCT పోలీస్ కానిస్టేబుల్ (APSP) (పురుషులు)


కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఆంధ్రప్రదేశ్ లేదా ఏపీ నివాస రుజువు ఉన్న దరఖాస్తుదారులు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వయస్సు మధ్య ఉండాలి. ఇతర రాష్ట్రాల నుండి 18 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ రిజర్వ్‌డ్ కేటగిరీకి చెందిన దరఖాస్తుదారులకు గరిష్ట వయోపరిమితిలో వయో సడలింపులను అందిస్తుంది.


కానిస్టేబుల్ పరీక్షలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులు. ప్రిలిమినరీ పరీక్ష అనేది బహుళ ప్రశ్నలతో కూడిన రాత పరీక్ష, అయితే ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ మరియు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఒక అభ్యర్థి భౌతిక సామర్థ్యాన్ని పరిశీలిస్తాయి. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ  పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడతారు, ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు  కలిగి ఉన్న పరీక్ష.


ప్రిలిమ్స్ పరీక్ష విధానం: ప్రిలిమ్స్ పరీక్షలో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పేపర్-1లో 100 ప్రశ్నలు-100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు-100 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.


మెయిన్ పరీక్ష విధానం: మెయిన్ పరీక్షలోనూ 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 3 గంటలు. ప్రధాన పరీక్షలో ఇంగ్లిస్, అరిథ్‌మెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ,పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్,మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.