రాష్ట్రంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయట్లేదంటూ, అలాగే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై అప్పట్లో విచారణ చేపట్టిన హైకోర్టు .. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంగన్‌వాడీ వర్కర్లకు విస్తరణ అధికారులుగా పదోన్నతి ఇవ్వడంపై స్టే విధించింది. తాజాగా స్టేను ఎత్తివేస్తూ నిబంధనల ప్రకారం సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 600 అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ల పోస్టులు భర్తీకానున్నాయి. హైకోర్టు తీర్పుతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


అంతే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాల్లో 560 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (ఈఓ) పోస్టుల భర్తీకి గతంలో ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు అంగన్‌వాడీ కార్యకర్తలకు పరీక్షలు కూడా నిర్వహించింది. అయితే, ఈ భర్తీ ప్రక్రియపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కాగా, అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ (గ్రేడ్‌–2) పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దంటూ రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గతంలోనే స్పష్టత ఇచ్చింది. ఈ క్రమంలో పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


'ఏపీపీఎస్సీ'కి షాకిచ్చిన హైకోర్టు, మూడు నోటిఫికేషన్లపై 'స్టే'
ఏపీలో ఉద్యోగాల నియామకాలపై హైకోర్టు 'స్టే'ల పర్వం కొనసాగుతోంది. అంతకు ముందు ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు, ఇతర పోస్టుల నియామక ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేయగా.. తాజాగా వివిధ పోస్టుల భర్తీ కోసం కేవలం ఇంగ్లిష్ భాషలోనే రాతపరీక్ష నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ చర్యలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన మూడు నోటిఫికేషన్లను నిలిపివేసింది. రాతపరీక్షలో ప్రశ్నలను తెలుగులోనూ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది.


హైకోర్టులో దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్  మేరకు నవంబరు 21న ఉత్తర్వులు జారీచేశారు. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 30న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కాశీ ప్రసన్న కుమార్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు నోటిషికేషన్ తదుపరి చర్యలను నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటరు దాఖలు చేయాలని ఏపీపీఎస్సీని ఆదేశిస్తూ విచారణను 3 వారాలకు వాయిదా వేశారు. అసిస్టెంట్ ఇంజినీర్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లపై కూడా హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది.


అలాగే వివిధ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం పోటీ పరీక్షను ఆంగ్లంలోనే నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సెప్టెంబరు 28న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ బి.చరణ్, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు.


టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ సెప్టెంబరు 26న ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ డి.శివశంకర్ రెడ్డి హైకోర్టులో ఇంకొక వ్యాజ్యం వేశారు. న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ ఆ రెండు నోటిఫికేషన్లలో తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. విచారణను డిసెంబరు 1కి వాయిదా వేశారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...