TS Anganwadi Vacancies: తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 9 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది. నియామక ప్రక్రియకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే జిల్లాల వారీగా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి.  ఈ పోస్టులకు ఏడు, పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళా అభ్యర్థులు అర్హులు. విద్యార్హత మార్కులు, స్థానికత, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


ఇంటర్ అర్హత తప్పనిసరి...
గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన ఉండేది. తాజా మార్గదర్శకాల ప్రకారం..టీచర్‌తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ పాసై ఉండాలి. అదేవిధంగా వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లు కాగా, 65 ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు. అయితే ప్రస్తుతం సహాయకులుగా పనిచేస్తున్న వారిలో కొందరికి కనీస విద్యార్హతలు లేకపోవడంతో.. టీచర్ల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయం మేరకు వ్యవహరించాలని శిశు సంక్షేమశాఖ భావిస్తోంది.


తెలంగాణలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో అంగన్వాడీ టీచర్‌తోపాటు, హెల్పర్ ఉంటారు. గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనవారు రాజీనామా చేయడం, ఇప్పటికే పనిచేస్తున్నవారికి సూపర్ వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది. సూపర్‌వైజర్ పోస్టుల్లోనూ 50 శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఇందుకు అయిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న టీచర్లను నిబంధనలకు అనుగుణంగా నియమించాలి. 


జిల్లాస్థాయిలోనే సరకుల సేకరణ..
అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన సరకులకు రాష్ట్రస్థాయిలో కేంద్రీకృత సమీకరణ విధానాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. జిల్లా స్థాయిలోనే జిల్లా కొనుగోళ్ల కమిటీల ఆధ్వర్యంలో సమీకరించుకోవాలని పేర్కొంటూ.. కలెక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. కొన్ని సరకులకు రాష్ట్రస్థాయిలో ప్రతి ఆరు నెలలకోసారి టెండర్లు నిర్వహించడంతో గుత్తేదారులు కుమ్మక్కై ధరలు పెంచుతున్నట్లు గుర్తించింది. ఈ కారణంగానే గతేడాది కందిపప్పు సమీకరణలో, కేంద్రాలకు సరఫరాలో ఆలస్యమైంది.


ALSO READ:


'గ్రూప్-1' పోస్టుల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్? కొత్తవాళ్లకే అవకాశం!
తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రాష్ట్రంలో గ్రూప్-1 కేటగిరీ ఖాళీల భర్తీకి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్​పీఎస్సీ చర్యలు మొదలుపెట్టింది. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి, వాటి భర్తీకి ఏర్పాట్లు చేయాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. ఇప్పటికే గ్రూప్-1 పోస్టుల ఖాళీల వివరాలను ఆర్థికశాఖ కోరగా.. అన్ని డిపార్ట్ మెంట్లలో కేవలం 43 మాత్రమే ఖాళీగా ఉన్నాయని అధికారులు తేల్చారు. మరో 23 పోస్టుల భర్తీపై వివాదాలుండటంతో, ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఆర్థికశాఖ భావిస్తోంది. దీనికితోడు రానున్న ఆరు నెలల్లో ఖాళీ అయ్యే పోస్టుల వివరాలనూ సేకరించాలని యోచిస్తున్నారు. కనీసం వంద పోస్టులనైనా కలపాలనే భావనలో ఉన్నారు. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
https://telugu.abplive.com/jobs/telangana-state-public-service-commission-to-release-group-1-supplementary-notification-soon-143196