Indo China War: 'యుద్ధాన్ని జనరల్స్‌కు వదిలేయడం చాలా తీవ్రమైన అంశం' - మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్‌ మాజీ ప్రధాని జార్జెస్‌ బెంజమిన్‌ క్లెమెన్‌సియా చెప్పిన మాటలివి! సైనిక అధికారులను సంప్రదించకుండా రచించిన అత్యుత్తమ ప్రణాళికలు సైతం విఫలమవుతాయని చరిత్ర నిరూపించింది. 1962 భారత్‌, చైనా యుద్ధంలో మనం దీని ఫలితాలను అనుభవించాం.


1959లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఈశాన్య ప్రాంతాన్ని (NEFA) రక్షించుకొనేందుకు అప్పటి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌పీపీ థొరాట్‌ ఓ ప్రణాళిక రచించారు. దానిని ఇప్పుడు థొరాట్‌ ప్లాన్‌ అంటున్నారు. 1959, అక్టోబర్‌ 8న ఈ ప్రణాళికను ఆర్మీ ప్రధాన కార్యాలయానికి పంపించాడు. చీఫ్‌ జనరల్‌ కేఎస్‌ తిమ్మయ్య దానిని ఆమోదించి రక్షణ మంత్రి వీకే కృష్ణ మేనన్‌కు పంపించారు. తమకేమి అవసరమో వ్యక్తిగతం కలిసి వివరించారు.


దురదృష్టవశాత్తు మేనన్‌ ఆ ప్రణాళికను ఆమోదించలేదు. అది ప్రమాదకరంగా ఉందని, అవసరం లేదని చెపపారు. తన దౌత్యంతో చైనాను ఆపగలనని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ సైతం చూడకుండానే థొరాట్‌ ప్లాన్‌ బుట్టదాఖలైంది. జార్జెస్‌ మాటలని పరిగణనలోకి తీసుకోని భారత పాలకులు పొరపాటుకు మూల్యం చెల్లించారు.


1962లో ఏం జరిగింది?


1962, నవంబర్‌ 20న చైనా కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు వారి సైన్యం తేజ్‌పుర్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. వారికి ఈ సమాచారం ఆలస్యంగా అందింది. దాంతో నవంబర్‌ 22 నాటికి అస్సామ్‌లోని తేజ్‌పుర్‌ ఘోస్ట్‌ సిటీగా మారిపోయింది. డ్రాగన్‌ సైన్యం రావడంతో అక్కడి ప్రజలు వెళ్లిపోవాల్సి వచ్చింది. భారత రక్షణ దళాలు కుప్పకూలడంతో మనం ఘోర ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పటికీ నాటి ఓటమి ఫలితాలు బాధిస్తూనే ఉన్నాయి. నెఫా నుంచి చైనీయులు వెళ్లిపోయినా తూర్పు లద్దాక్‌లో మాత్రం అలాగే ఉండిపోయారు.


అరుణాచల్‌ ప్రదేశ్ ఈశాన్య ప్రాంతాన్ని భారత్‌కు వదలిపెట్టేందుకు ఓ కారణం ఉంది. అక్కడ రహదారి, మౌలిక సదుపాయాలు లేవు. రోడ్లు వేయాలి. విద్యుత్‌ ఏర్పాటు చేయాలి. లాజిస్టిక్స్‌ అవసరం. అప్పటికి ఆర్థిక వ్యవస్థ సైతం బాగాలేకపోవడంతో చైనీయులు కీలక ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లారు. అక్కడ ఎలా పోరాడాలో ప్రణాళికలు రచించుకోకపోవడంతో భారత సైన్యం త్వరగానే అలసిపోయింది. యుద్ధం ముగిసిన తర్వాత నెఫాలో అదే థొరాట్‌ ప్లాన్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.


లద్దాక్‌ ఎందుకు భిన్నం?


లద్దాక్‌ విషయానికి వస్తే అక్కడి నైసర్గిక స్వరూపం భిన్నం. టిబెట్‌ పీఠభూమిని పొడగించినట్టుగా ఉంటుంది. చైనా వారు సులభంగా దేశాన్ని దాటే విధంగా ఉంటుంది. పర్వతాలు, ఎగుడు దిగుడు భూములు కావడంతో భారత్‌కు ప్రయోజనకరంగా మారింది. అక్సాయి చిన్‌ నుంచి వేసిన రహదారి టిబెట్‌కు సమాంతరంగా షిన్‌షియాంగ్‌ ప్రావిన్స్‌కు అనుసంధానమై ఉంటుంది. డ్రాగన్‌ సైనికులు ఇక్కడికి వేగంగా రాగలరు. లాజిస్టిక్స్‌ను తరలించగలరు. ఇది వారికి లాభం. ఎత్తైన పర్వతాలు ఉండటం మనకు రక్షణ. అందుకే థొరాట్‌ప్లాన్‌ అమలు చేస్తున్నారు. ఇన్నాళ్లుగా అక్కడ రహదారులు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తుంటే చైనా నుంచి ఎక్కువ ఒత్తిడి ఉండేది. వెనక్కి తగ్గాల్సి వచ్చేది.


భారత ఆర్థిక వ్యవస్థ 1960 నుంచి 1990 వరకు బలహీనంగా ఉండేది. 1965, 1971 పాకిస్థాన్‌ యుద్ధం వల్ల ఆహార కొరత నుంచి రక్షణ వరకు సవాళ్లు ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఎకానమీని అభివృద్ధి చేస్తూనే పక్క దేశాలతో దౌత్యం కోసం విపరీతంగా శ్రమించాల్సి వచ్చేది. వనరులు లేకపోవడంతో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఈశాన్య ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని పట్టించుకోలేదు. దాంతో హిమాలయ ప్రాంతంలో సరిహద్దు రేఖ వద్ద డ్రాగన్‌ వ్యూహాత్మక బలం సాధించింది.


మరోవైపు చైనాలో 1980ల్లో పరిస్థితులు మారాయి. డెన్‌ జియావో పింగ్‌ చొరవతో ఎకానమీ అభివృద్ధి చెందింది. భారత్‌తో పోలిస్తే బలంగా మారింది. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు, ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఎకానమీకి దారులు తెరిచేంత వరకు, మూడు దశాబ్దాల పాటు ఈ అంతరం అలాగే ఉండేది. ఎకానమీ బూమ్‌తో టిబెట్‌లో చైనా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసింది. 1965 కి.మీ పొడవైన క్వింఘై-టిబెట్‌ రైల్వే లైన్‌ వేసింది. ఇది లాసా నుంచి బీజింగ్‌, చెంగ్డు, చాంగ్‌పింగ్‌, గ్వాంఝౌ, షాంఘై, జింజింగ్‌, లాంగ్జౌకు అనుసంధానమైంది. అంటే ఈ రైలు మార్గం ద్వారా చైనాలోని మేజర్‌ సైనిక ప్రాంతాలన్నీ లాసాకు అనుసంధానంగా ఉంటాయి. 2021లో నియంత్రణ రేఖకు 50 కి.మీ దూరం ఉండే యింగ్‌చీ నుంచి లాసాకు రైల్వే లైన్‌ వేశారు. మొత్తంగా టిబెట్‌లో 1,18,800 కి.మీ పొడవైన రోడ్లు ఉన్నాయి. దాంతో అత్యంత వేగంగా, సులభంగా చైనా తన సైనికులను సరిహద్దుకు తరలించగలదు.


డోక్లాంతో నేర్చిన పాఠాలు!


నియంత్రణ రేఖ వద్ద 2010 నుంచి చైనా చొరబాట్లు విపరీతంగా పెరిగాయి. 4000 కి.మీ పొడవైన సరిహద్దులోని భారత ప్రాంతాల్లోకి చైనీయులు వచ్చారు. 2010-13 మధ్యలోనే 500 చొరబాట్లు జరిగాయి. 1062 తర్వాత చైనా నుంచి 2013, ఏప్రిల్‌లో భారత్‌ ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంది. దెస్పాంగ్‌ పీఠభూమిలోని తూర్పు లద్దాక్‌లో 10 కి.మీ మేర చైనా సైన్యం ఆక్రమించింది. హెలికాప్టర్ల ద్వారా ఇక్కడికి ఆహారం చేరవేశారు. ఇది మనల్ని అలర్టర్‌ చేసింది.


2017లో భారత్‌, భూఠాన్‌, చైనా (టిబెట్‌) ట్రై జంక్షన్‌లో 73 రోజుల పాటు భారత్‌, చైనా సైనికులు బాహాబాహీకి దిగారు. భూఠాన్‌, చైనాది చెప్పుకొనే డోక్లాంలో చైనా ఇంజినీర్లు రహదారి నిర్మించేందుకు సిద్ధమవ్వడంతో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. వ్యూహాత్మక జల్పాయిగురి నడవా మనకు అత్యంత కీలకం కావడంతో చైనా, భారత సైనికులు ఘర్షణకు దిగారు. చాలా మంది మరణించారు. దాంతో సుదీర్ఘ చర్చల తర్వాత సైనికులను వెనక్కి తరలించి యథాతథ స్థితిని అమలు చేసేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. కానీ చైనా గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణాలు చేస్తూనే ఉండటం కలవర పెడుతోంది.


మూడేళ్ల తర్వాత మరోసారి భారత్‌, చైనా బలగాలు నువ్వా నేనా అన్నట్టు ఘర్షణకు దిగాయి. 45 ఏళ్ల తర్వాత తొలిసారి రెండు దేశాల సైనికులు 2020, జూన్‌ 15న గల్వాన్ లోయలో కలబడ్డారు. రెండు వైపులా ప్రాణ నష్టం జరిగింది. దాదాపుగా యుద్ధం తరహాలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి రెండు దేశాలు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాయి. మరోవైపు దౌత్య పరమైన చర్చలు కొనసాగిస్తున్నాయి. ఏదేమైనా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ఎవ్వరూ అంగీకరించలేదు.


వేగంగా మౌలిక నిర్మాణాలు


డోక్లాం ఘర్షణ తర్వాత గత ఐదేళ్లలో బారత్‌ 3500 కిమీ రహదారులు నిర్మించింది. అదే సమయంలో టిబెట్‌లో చైనా సైనిక మౌలిక సదుపాయాలు నిర్మించింది. అందులో 60వేల కి.మీ రైలు, రోడ్డు నెట్‌వర్క్‌ ఉంది. అయితే మనవైపు ఎత్తైన పర్వతాలు, లోయలు ఉన్న సంగతి గుర్తించాలి. టిబెట్‌ పీఠభూమి చదునుగా ఉంటుందని తెలుసుకోవాలి. భారత సరిహద్దు వద్దకు సైనికులు, సామగ్రిని తరలించేందుకు G-695 ఎక్స్‌ప్రెస్‌ వేనూ ప్లాన్‌ చేసింది. వాయువ్య జమ్ములోని ఉదంపుర్‌ నుంచి అస్సాంలోని టిన్‌సుకియా వరకు 4000 కి.మీ వరకు రైలు, రోడ్డు నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. అత్యంత వేగంగా నియంత్రణ రేఖ వద్దకు సామగ్రి, ఆహారం, సైనికుల్ని తరలించేందుకు పర్వతాల గుండా లింక్‌ రోడ్లు, ఫీడర్‌ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న 73 ఐసీబీఆర్‌లు అదే పని చేస్తాయి.