Ideas Of India Summit 2024: ఏబీపీ నెట్ వర్క్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా 3.0' సమ్మిట్‌ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముంబై వేదికగా శుక్ర, శనివారాల్లో జరిగే ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిపుణులు పాల్గొననున్నారు. మన దైనందిన జీవితాలను ప్రభావితం చేసే చిన్న చిన్న అంశాలను కూడా వివిధ కోణాల్లో చర్చించి.. భవిష్యత్ లో ప్రపంచాన్ని మార్చే అద్భుతమైన విషయాలను , ఆలోచలను పంచుకోవడానికి ఈ వేదిక ఓ మంచి అవకాశం కల్పిస్తోంది.



భారతదేశం , ప్రపంచం ఎలా ముందుకు పురోగమించాలో 2024 నిర్ణయించనుంది.  సమాజం, సంస్కృతి, రాజకీయాలు, మంచి, చెడు, వికృతమైన మార్పులను అంచనా వేసి, తమకు ఏం కావాలో ప్రపంచానికి తెలియజేసే 'పీపుల్స్ ఎజెండా' సంవత్సరం ఇది. ఐడెంటిటీ పాలిటిక్స్ నుండి వాతావరణ మార్పు వరకు, కృత్రిమ మేధస్సు  సవాళ్లు నుండి ప్రపంచ శక్తి  విపత్తు వరకు ఐడియాస్ ఆఫ్ సమ్మిట్‌లో చర్చిస్తారు. యూరోపియన్ యుద్ధం  నుంచి నేర్చుకోవాల్సిన "పాలి క్రైసిస్" అంశాలపైనా ప్రపంచం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఎలా చూసినా 2024 ఓ గేమ్ చేంజర్ సంవత్సరం అనుకోవచ్చు. 


ముఖ్య అతిథులు వీరే


ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0లో బ్రిటీష్ ఎంపీ సుయెల్లా బ్రేవర్ మన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఇండో-అమెరికన్ రచయిత్రి, మోడల్ పద్మ లక్ష్మి, కళాకారిణి సుబోధ్ గుప్తా, రచయిత అమిష్ త్రిపాఠి, నటి కరీనా కపూర్ ఖాన్, ఫైనాన్స్ కమిషన్ చైర్ పర్సన్ అరవింద్ పనగరియా, పొలిటికల్ సైంటిస్ట్ సునీల్ ఖిల్నానీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు పాల్గొంటారు.