రోజురోజుకూ మారుతున్న వాతావరణంతో పలు రకాలు వ్యాధ్యులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొవిడ్, ఇన్ ఫ్లుయెంజా లాంటి వైరస్ లతో ఇప్పటికే సతమవుతోన్న నగర జనాలను ఇప్పుడు క్షయ మహమ్మారి వణికిస్తోంది. ఇది ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ధీర్ఘకాలికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్చి 24న 'ప్రపంచ క్షయ దినోత్సవం' నేపథ్యంలో కామినేని హాస్పిటల్స్‌కు చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ డా.డి.ఎస్.సౌజన్య తెలిపిన వివరాలివి.


క్షయ వ్యాధితో మన దేశంలో ప్రతి నిమిషానికి ముగ్గురు చొప్పున, సంవత్సరానికి మూడు లక్షల మంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, ధూమపానంతో పాటు వ్యాధిని సరైన సమయంలో గుర్తించి, మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. క్షయ వ్యాధి కేవలం ఊపిరితిత్తులకే వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ శరీరంలోని ఏ భాగాకైనా వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. ఎముకలు, లింపు గ్రంధులు, మెదడు పొరలు, మూత్ర పిండాలు, పేగు వ్యవస్థకూ ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ జబ్బు ఎక్కువగా ఊపితిత్తులనే టార్గెట్ చేస్తుంది.


టీబీ లక్షణాలు


నాలుగు వారాలకు పైగా ఎడతెరిపి లేకుండా దగ్గు, విపరీతమైన దగ్గుతో పాటు కఫం రావడం, సాయంత్రం, రాత్రి వేళల్లో జ్వరం, ఒక్కసారిగా బరువు తగ్గడం, ఆకలి అసలు లేకపోవడం ప్రధాన లక్షనాలు.


వ్యాధి నిర్ధారణ పరీక్షలు


నిపుణులైన వైద్యుల సలహా మేరకు కొన్ని ప్రామాణికమైన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ సులువుతుంది. కఫం స్మిర్, చెస్ట్ ఎక్స్ రే, స్పుటం కల్చర్ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన న్యూక్లియర్ యాసిడ్ అమ్ప్లిఫికేషన్ టెస్ట్ ద్వారా కేవలం 100 నిమిషాల్లో సులువైన పద్ధతిలో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. NAAT గా పిలిచే ఈ టెస్ట్ డీఎన్ఏ ఆధారంగా రూపొందించారు. క్షయను గుర్తించడంలో మూడు రెట్లు మెరుగైన ఫలితాలు అందిస్తుంది. 


ఎవరికి ప్రమాదం?


రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లలు, వయస్సు మీరిన వాళ్ళు, హెచ్ఐవి సోకిన వాళ్లు, పోషకాహారం లభించని వయోజనులకు క్షయ వ్యాధి సులభంగా సోకే ప్రమాదం ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో వ్యాధి సోకకుండా, సోకినా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంది. క్షయ రోగికి ఒకరికి వ్యాధి నయం కాకపోతే అతని ద్వారా 15 నుంచి 20 మందికి ఈ జబ్బు సోకే ప్రమాదం ఉంది. 


ఆ వ్యక్తి దగ్గినపుడు లేదా తుమ్మినపుడు దాదాపు 40 వేల దాకా వ్యాధికారక సూక్ష్మక్రిములు వాతావరణంలో కలిసిపోయి, ఇతరులలో ప్రవేశించే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి తగ్గినపుడు అవి విజృంభించి క్షయ వ్యాధి బయటపడుతుంది. ఈ కారణంగానే క్షయ రోగిని విడిగా గదిలో ఉంచి చికిత్స చేయిస్తూనే, దగ్గరుండి వ్యాధి నయం అయ్యే వరకు కనిపెడుతూ ఉండాలని డాక్టర్లు సూచిస్తుంటారు. క్షయ రోగి మందులు ఖచ్చితంగా వాడుతున్నడా చూసి వాడేందుకు ఒప్పించటం, ఈ చికిత్సలో భాగంగా వాడే మందుల వల్ల వచ్చే చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్‌ను తట్టుకునే విధంగా వారికి పోషకాహారాన్ని అందించటం అవసరం. 


ఈ వ్యాధికి గురైన వారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. మందులు మానివేయటం లేదా అడపాదడపా మందులు వేసుకోవడం వల్ల టీబీ కారక బాక్టీరియా మరింత శక్తివంతంగా తయారవుతుంది. దాంతో రోగిలో వ్యాధి ముదిరి మందులకు లొంగనిదిగా తయారవుతుంది.  ప్రస్తుతం దేశంలో క్షయ వ్యాధిసోకిన వారిలో దాదాపు పదిశాతం మంది ఈ విధంగా మందులకు లొంగని టి.బి.తోనే బాధపడుతున్నారని ఈ సందర్భంగా కామినేని ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఏ వ్యాధినైనా ప్రారంభంలో ఉన్నప్పుడు కాస్త నియంత్రిచొచ్చు. కానీ అదే గనక ముదిరితే ఏం చేయలేం. కాబట్టి క్షయవ్యాధి గ్రస్థులు వ్యాధి నిర్ధరణ కాగానే చికిత్స ప్రారంభించాలని, పూర్తిగా తగ్గేవరకు మందులు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.


Also Read: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?