డయాబెటిస్ ఉన్న రోగులకు ఆహార పరిమితులు, జీవనశైలిలో మార్పులు చాలా అవసరమని వైద్యులు చెబుతుంటారు. అవి పాటిస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఏవి తినాలి, ఏవి తినకూడదనే దాని మీద పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. పాలు, పెరుగు తీసుకోవాలంటే మధుమేహులు కాస్త ఆలోచిస్తారు. కానీ ఈ పాలు మాత్రం ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసా.. ఒంటె పాలు. అవును ఒంటె పాలు మధుమేహులకు చాలా మేలు చేస్తాయని అనేక అధ్యయనాలు కూడా నిరూపిస్తున్నాయి.


ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యూనోగ్లోబులిన్స్, లాక్టోఫెర్రిన్లు సమృద్ధిగా ఉంటాయి. అంటువ్యాధులు, హానికరమైన బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. భారత్ లో ఆవుపాల మాదిరిగానే ఒంటె పాలు కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. కాల్షియం, కొవ్వు, ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.


మధుమేహులకు మంచిదేనా?


ఒంటె పాలు మధుమేహులకు మంచిదేనా అంటే అవుననే అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో తక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉన్నాయి. ఇది డయాబెటిక్ రోగులకు మంచిది. తక్కువ మొత్తంలో లాక్టోస్ కలిగి ఉంటుంది. అందుకే టైప్ 1, టైప్ 2 మధుమేహం ఉన్న రోగులు ఒంటె పాలు తీసుకుంటే మంచిదని అంటున్నారు. షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవాలంటే రోజుకి 500 ఎంఎల్ ఒంటె పాలు తీసుకోవాలని సిఫార్స్ చేస్తున్నారు.


ఎలా తీసుకోవాలి?


ఒంటె పాలు కాచుకుని తాగితే అందులోని పోషకాలు తగ్గిపోతాయి. అందుకని పచ్చి పాలు  తాగడం మంచిదని చెప్తున్నారు. ఈ పాలు పాశ్చరైజేషన్ ఉండదు కాబట్టి పచ్చివి తాగితే పోషకాలు అందుతాయి. వీటితో చీజ్, పన్నీర్ గా ఉపయోగించుకోవచ్చు. నాలుగు కప్పుల ఒంటె పాలు సుమారుగా 52 యూనిట్ల ఇన్సులిన్ అందిస్తుంది. అందుకే ప్రతిరోజు రెండు కప్పుల ఒంటె పాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోనే ఉంటాయి.


ఖరీదు ఎక్కువే


ఆవు పాల కంటే ఒంటె పాలు చాలా ఖరీదైనవి. 200 గ్రాముల ఒంటె పాలతో చేసిన మిల్క్ పౌడర్ రూ.700. అందుకే ప్రతిరోజు దీన్ని కొనడం సాధ్యం కాకపోవచ్చు. ఒంటె ప్రసవించిన తర్వాత 13 నెలల వరకు మాత్రమే పాలు ఇస్తుంది. అందుకే వీటికి ఇంత డిమాండ్, ఖర్చు ఎక్కువ. రోజుకి ఆవు ఇచ్చే పాలకంటే తక్కువ పాలని ఇది ఇస్తుంది. ఒక రోజుకి 6 లీటర్లు మాత్రమే ఇస్తుంది.


వీళ్ళు తాగకూడదు


ఒంటె పాలు పచ్చిగా తీసుకున్నప్పటికీ వీటి వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. ఇవి కొన్ని సార్లు విషంగా కూడా మారవచ్చు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలు, వృద్ధులు, రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్న వాళ్ళు పచ్చి పాలు అసలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవు పాలు గిట్టని వాళ్ళు మొదటగా కొంచెం వీటిని తీసుకోవాలి. ఆరోగ్యానికి ఒంటె పాలు సరిపోయాయి అనుకున్న తర్వాత క్రమంగా వాటిని తీసుకోవచ్చు. రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఈ పాలని తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి. ఎందుకంటే ఇందులో విటమిన్ కె స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఒత్తిడి వల్ల శరీరమే కాదు, నోరూ చెడిపోతుంది జాగ్రత్త!