ప్రస్తుతం కేరళను వణికిస్తున్న పేర్లలో షవర్మా కూడా ఒకటి. కేవలం కేరళనే కాదు అక్కడ జరిగిన సంఘట వలన మొత్తం దేశవ్యాప్తంగా దీని పేరు ఎక్కువగా వినపడుతోంది. ఎందుకంటే తాజాగా ఓ వ్యక్తి షవర్మా ఆర్డర్ చేసుకుని అస్వస్థకు గురై చనిపోయాడు. వేరే ఇతర కారణాలు అనుకోవడానికి లేకుండా.. షవర్మా వల్లనే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయాడు. ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా సర్క్యూలేట్ అవుతుంది.


కేరళలోని ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. బాధితుడు మాత్రం షవర్మా ఆర్డర్ చేసుకుని తిన్నాడు. మిగిలిన వారు ఇతర ఆహారపదార్థాలు తిన్నారు. వారు అంతా బాగానే ఉన్నారు. సడెన్​గా షవర్మా తిన్న వ్యక్తి మాత్రం వాంతులు చేసుకున్నాడు. తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. తీసుకున్న షవర్మా వల్లనే ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. గతంలో ఓ వ్యక్తి చనిపోయాడు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు.


ఇంతకీ షవర్మా వల్ల నిజంగానే ఫుడ్ పాయిజన్ చనిపోతారా? అలా నిజంగా చనిపోతే ఇప్పటికే ఈ సంఖ్య పెరిగి ఉండాలి కదా. మరి ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగింది? షవర్మా తిన్న వెంటనే అతను ఎందుకు చనిపోయాడు అనే ప్రశ్న అందరిలో ఉంది. నిజంగా షవర్మా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం. 


స్టాక్​ను ఎక్కువరోజులు నిల్వ చేస్తే..


సాధారణంగా షవర్మాకు చెందిన స్టఫ్​ను ఎక్కువ సేపు కాల్చుతూ ఉంటారు. అది చికెన్ అయినా.. మటన్ అయినా.. మసాలతో కూడిన మాంసం రోటీస్సెరీపై కాలుతూ ఉంటుంది. ఇలా దేనినైనా ఓవర్​గా కుక్ చేసినప్పుడు దానిలోని పోషకాలు కోల్పోతాయి. కొన్నిసార్లు మిగిలిన నాన్​వెజ్​ స్టాక్​ను స్టోర్​ చేసి.. దానిని అలాగే రెండో రోజు కూడా వినియోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో చికెన్​కు బదులుగా ఇతర జంతువుల కళేబేరాలను వినియోగిస్తారు. ఇలాంటివి తిన్నప్పుడు శరీరం అనారోగ్యానికి గురవుతుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి మరణాలు సంభవించవచ్చు. అయితే షవర్మా ఆరోగ్యానికి అసలు మంచిదేనా అంటే.. అస్సలు కాదు అంటున్నారు నిపుణులు.


దుష్ప్రాభావాలే ఎక్కువ..


షవర్మా అనారోగ్యకర ఫ్యాటీ యాసిడ్లతో నిండి ఉంటుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్​ను పెంచుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా దీనిలో అత్యధిక కేలరీలు ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వును ఏర్పరచి.. బరువు పెరిగేలా చేస్తాయి. కొందరిలో వాంతులు, వికారం, డయోరియా, కడుపునొప్పి రావొచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు షవర్మా తింటే బ్లడ్​ షుగర్​ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి ఫుడ్​కి దూరంగా ఉండడమే మంచిది. ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. లేట్​ చేసే కొద్ది పరిస్థితి విషమంగా మారే ప్రమాదముంది. కాబట్టి ఇలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఏదైనా తేడాగా అనిపిస్తే వైద్యుడి దగ్గరకు వెళ్లండి. 


Also Read : సీజనల్ వ్యాధులు దరిచేరకూడదంటే ఇవి తినాలి.. ఎందుకంటే?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.