Covid 19 Vaccination: మోదీకి మరో గిఫ్ట్ రెడీ.. ఒక్కరోజులో 2 కోట్ల డోసులు పంపిణీ.. జెట్ స్పీడ్‌లో వ్యాక్సినేషన్!

ABP Desam   |  Murali Krishna   |  17 Sep 2021 05:28 PM (IST)

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ రికార్డులు సృష్టిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నాటికే కోటి వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసిన ఆరోగ్యశాఖ మరో 4 గంటల్లోనే 2 కోట్ల మార్కును దాటేసింది.

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డ్

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం కోటిన్నర వ్యాక్సిన్​ డోసులను అందించాలని ఆరోగ్యశాఖ లక్ష్యం పెట్టుకుంది. అయితే అనూహ్యంగా 2 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం జెట్ స్పీడ్‌లో సాగుతోంది.

మధ్యాహ్నం 1.30 గంటల లోపు..

శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 గంటల లోపు కోటికిపైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఆ తర్వాత మరో నాలుగు గంటల్లోనే మరో కోటి డోసులు పంపిణీ చేసి ఆశ్చర్యపరిచింది. నెల రోజుల కన్నా తక్కువ వ్యవధిలో రోజుకు కోటి డోసులు పంపిణీ చేయడం ఇది నాలుగోసారి. కానీ ఒక్కరోజులో 2 కోట్ల డోసులు అందివ్వటం ఇదే తొలిసారి.

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 1:30 వరకు దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కోటి మార్కును దాటింది. అత్యంత వేగంగా కోటీ మార్కును అందుకోవడం ఇదే తొలిసారి. టీకా పంపిణీలో శుక్రవారం సరికొత్త రికార్డును సృష్టించి ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన కానుకగా ఇస్తాం.                                               -  మన్‌సుఖ్‌ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి

శుక్రవారం ఉదయం నాటికి మొత్తం 77.24 కోట్లకు పైనే టీకా డోసులు పంపిణీ చేసినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భారత్ వేగంగా ఉందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.

Published at: 17 Sep 2021 04:19 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.