దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 39 వేల కేసులు వెలుగుచూశాయి. ఆదివారం 11,54,444 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 39,361 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇక మరణాల సంఖ్య దాదాపు 400కు దిగొచ్చింది. గడిచిన 24 గంటల్లో 416 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ చనిపోయిన వారి సంఖ్య 4,20,967కి చేరింది. మార్చి 30న 354 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ తర్వాత మృతుల సంఖ్యలో ఈ స్థాయి తగ్గుదల కనిపించడం ఇదే తొలిసారి.


ఇక నిన్న 35,968 మంది కోలుకున్నారు. మొత్తం కేసులు 3.14 కోట్లకు చేరగా.. 3.05కోట్ల మంది వైరస్‌ను జయించారు. క్రియాశీల రేటు 1.31 శాతానికి చేరగా.. రికవరీ రేటు 97.35 శాతంగా ఉంది. అయితే ఇటీవలి కాలంలో రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కేరళలో కొత్త కేసులు భారీగా వెలుగుచూశాయి. అక్కడ 17,466 మందికి వైరస్ సోకింది. మహారాష్ట్రలో 6,843 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నిన్న దేశవ్యాప్తంగా 18.99లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన టీకా డోసులు 43.51,96,001గా ఉన్నాయి.


మూడో వేవ్ వచ్చేస్తోంది..


దేశంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ప్రస్తుతం కరోనా రోజువారీ కేసులు 40వేలకు తగ్గినప్పటికీ... మొదటి వేవ్‌లో రోజువారి నమోదైన కేసుల కన్నా ఎక్కువే నమోదవుతున్నాయన్న విషయాన్ని గుర్తించాలన్నారు. కాబట్టి సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగిసిందని చెప్పడానికి లేదన్నారు. లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో ప్రయాణాలు ఎక్కువగా జరుగుతున్నాయని... కాబట్టి రాబోయే వారాల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదని అన్నారు. సెప్టెంబర్ నాటికి థర్డ్ వేవ్ అవకాశం ఉందన్నారు.


భారత్‌లో ఇప్పటికే మూడింట రెండు వంతుల జనాభాలో యాంటీబాడీలు ఉన్నాయని సీరమ్ సర్వేలో వెల్లడైన విషయంపై డా.గులేరియా స్పందించారు. ఇప్పటికీ ఒక వంతు జనాభా వైరస్ రిస్క్‌ను ఎదుర్కొంటోందన్న విషయాన్ని ప్రస్తావించారు. యాంటీబాడీలకు సంబంధించి రెండు అంశాలను పేర్కొన్నారు. ఒకటి... శరీరంలో 'X' స్థాయిలో యాంటీబాడీలు ఉంటే రీఇన్ఫెక్షన్ బారినపడకుండా ఉంటారని చెప్పేందుకు ఎటువంటి అవకాశం లేదన్నారు. రెండవది... వైరస్ బారినపడి కోలుకున్నవారిలో క్రమంగా యాంటీబాడీల సంఖ్య తగ్గిపోతుందన్నారు. అయితే వ్యాక్సినేషన్ పెరగడం మంచి పరిణామని... థర్డ్ వేవ్ మరీ అంత ఆందోళనకరంగా ఉండకపోవచ్చునని అన్నారు.





ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాచించకుండా లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు లైట్ తీసుకుంటే కరోనా థర్డ్ వేవ్ ప్రమాదకరంగా ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. కనుక ప్రజలు నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి మాత్రమే బయటకు రావాలని సూచిస్తున్నారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.