వ్యాక్సిన్ వేసుకున్నాక.. కరోనా వస్తుందా? రాదా? వస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది? అని చాలామందికి అనుమానాలు. వ్యాక్సిన్ వేసుకున్నా ఎలాంటి ఫలితం లేదని విశ్లేషణలు కొందరివి. కానీ వ్యాక్సిన్ తీసుకున్న వారి పరిస్థితి.. బెటర్ అని చెబుతోంది ఐసీఎంఆర్.


ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలను తగ్గించడంలో కరోనా టీకాలు మంచి పనితీరు చూపాయని ఐసీఎంఆర్ అంటోంది. కరోనా టీకా తీసుకున్న తర్వాత వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై ఐసీఎంఆర్  ఓ అధ్యయనం చేసింది. కొవిడ్ సెకండ్ వేవ్ ఎక్కువగా ఉన్న సమయంలో చేసిన ఈ అధ్యయనం దేశంలో మెుదటిది. అంతేకాదు అతిపెద్దది కూడా. దేశవ్యాప్తంగా మెుత్తం 677 కొవిడ్ పాజిటివ్ వ్యక్తులపై దీన్ని నిర్వహించగా.. 80 శాతం మందికిపైగా డెల్టా వేరియంట్ బారిన పడ్డారని అధ్యయనంలో తెలిసింది. అయితే వారు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొలేదని చెబుతోంది.


ఐసీఎంఆర్ చెప్పిన విషయాలు..



  1. ఇప్పటికే ఒకటి లేదా రెండు డోసుల టీకా తీసుకున్న వారు.. కొవిడ్ బారిన పడిన వ్యక్తులపై ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. వారి నుంచి సేకరించిన నమూనాలను విశ్లేషించింది.

  2. వైరస్ సోకిన 677 మంది నమూనాలను విశ్లేషించగా. అందులో 86.09 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్ ఉందని తెలిసింది.

  3. ఆ మెుత్తం కేసుల్లో 9.8 శాతం మంది ఆసుపత్రిలో మాత్రమే ఆసుపత్రిలో చేరారు. 0.4 శాతం మరణాలే సంభవించాయి. అంటే టీకా తీసుకోవడం వల్ల ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి, మరణాలు తగ్గుతున్నాయని.. అధ్యయనం చెబుతోంది.

  4. 677 మందిలో 71శాతం మందికి లక్షణాలు కన్పించగా.. 29శాతం మందికి ఏ లక్షణాలూ లేవు. లక్షణాలు ఉన్నవారు.. జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు జలుబు, రుచి, వాసన తెలియకపోవడం, నీళ్ల విరేచనాలు, శ్వాస తీసుకోలేకపోవడం లాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


వ్యాక్సిన్ తీసుకున్నవారికి కరోనా సోకినా.. తీవ్రస్థాయి అనారోగ్యం, మరణం ముప్పు తక్కువని గతంలో దిల్లీ ఎయిమ్స్ చేసిన అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్ తీసుకున్నాక కొవిడ్ వచ్చిన 63 మంది ఆరోగ్య పరిస్థితిని ఎయిమ్స్ నిపుణులు గమనించారు. వారిలో 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక్కడోసు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారే.. మెుత్తంగా 53 మంది కొవాగ్జిన్, 10 మంది కొవిషీల్డ్ టీకా వేయించుకున్నారు. రెండు డోసులు తీసుకున్నవారిలో 52.8 శాతం మంది, ఒక్క డోసు తీసుకున్నవారిలో 47.7 శాతం మంది ఇన్ ఫెక్షన్ కు గురయ్యారు. వీరికి  5 నుంచి 7 రోజులపాటు జ్వరం వచ్చినా.. తీవ్రస్థాయి అనారోగ్యం మాత్రం దరిచేరలేదని ఎయిమ్స్ నిపుణులు గతంలో గుర్తించారు. వ్యాక్సిన్ వేసుకోని వారితో పోల్చితే.. వేసుకున్న వారి పరిస్థితి సరిగా ఉందని ఎయిమ్స్ అధ్యయనంలో తెలిపింది.