ABP Desam Health Conclave 2024 Live Updates: ABP దేశం నేతృత్వంలో Health Conclave 2024 ప్రారంభమైంది. ABP Digital Video Head సునీల్ గోస్వామి జ్యోతి ప్రజ్వలనం చేసి ఈ ప్రోగ్రామ్ నీ ప్రారంభించారు. పలువురు హెల్త్ ఎక్స్‌పర్ట్స్‌ ఈ ఈవెంట్‌కి హాజరయ్యారు. ముందుగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శ్రీవేణు మాట్లాడారు. గట్ హెల్త్‌పై కీలక విషయాలు వివరించారు. చాలా మంది అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారని, ఈ కారణంగానే జీర్ణకోశ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. వైట్ ఫుడ్‌ వీలైనంత వరకూ తగ్గించుకోవాలని సూచించారు. ఒమెగా 3 ఫ్యాట్స్‌ ఉన్న ఆహారం తీసుకోవాలని తెలిపారు. ఇదే సమయంలో స్ట్రీట్‌ ఫుడ్ గురించి మాట్లాడారు డాక్టర్ శ్రీవేణు. లైఫ్‌స్టైల్ మారిపోవడం వల్ల బయట ఎక్కడ పడితే అక్కడ తినడం అలవాటవుతోందని, కానీ వీలైనంత వరకూ తగ్గించాలని సూచించారు. స్ట్రీట్‌ ఫుడ్‌లో హానికరమైన టైటానియం డయాక్సైడ్‌తో పాటు కలరింగ్ ఏజెంట్స్ ఉంటాయని వివరించారు. స్ట్రీట్ ఫుడ్ తినడం పూర్తిగా మానేయకపోయినా..క్రమంగా తగ్గించాలని చెప్పారు. ఇండియన్ ఫుడ్‌కి మించి మంచి పోషకాహారం ఇంకెక్కడా ఉండదని స్పష్టం చేశారు. వీలైనంత వరకూ ఇంట్లో వండిన ఆహార పదార్థాలే ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. జీర్ణ క్రియకు మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుందని, ఈ బ్యాక్టీరియా పెరగాలంటే కూరగాయలు, పండ్లు తినాలని డాక్టర్ శ్రీవేణు వెల్లడించారు. 


కొలనల్ క్యాన్సర్ గురించీ డాక్టర్ శ్రీవేణు ప్రస్తావించారు. ప్రపంచంలో కొలనల్ క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధుల్లో మూడో స్థానంలో ఉందని వెల్లడించారు. అయితే..ప్రస్తుతానికి భారత్‌లో ఈ క్యాన్సర్ బాధితులు తక్కువేనని అన్నారు. అందుకు కారణాలనూ వివరించారు. ఇండియన్స్ తీసుకునే సాంబార్‌ వల్లే కొలనల్ క్యాన్సర్ రావడం లేదని ఆసక్తికర విషయం వెల్లడించారు. సాంబార్‌లో మనం యాడ్ చేస్తున్న ఇన్‌గ్రీడియెంట్స్ ఈ క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తున్నాయని తెలిపారు. డైట్‌లో నట్స్, గ్రెయిన్స్ తీసుకోవాలని సూచించారు. ర్యాడిష్, క్యారట్,బీట్‌రూట్‌,యాపిల్‌...ఇలా అన్ని రకాల ఫుడ్‌ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని వివరించారు.