Sharad Pawar Did Not Give MP Ticket To Lawyer Who Argued On Behalf Of Kasab: 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ముంబై తాజ్ హోటల్‌పై దాడి చేసి అనేక ప్రాణాలను బలిగొన్న కసబ్ తరఫున వాదించిన న్యాయవాది మజిద్ మెమన్‌కు శరద్ పవార్ MP టికెట్ ఇవ్వగా, అదే కసబ్‌కి ఉరి శిక్ష పడేలా వాదించిన న్యాయవాది ఉజ్వల్ నికమ్‌కు బీజేపీ MP టికెట్ ఇచ్చింది అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై శోధించిన 'Factly' స్పష్టత ఇచ్చింది. అది నిజం కాదని.. లాయర్ మజీద్ మెమన్ అజ్మల్ కసబ్ విచారణతో సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది.


క్లెయిమ్: శరద్ పవార్ అజ్మల్ కసబ్ న్యాయవాది మజీద్ మెమన్‌ను రాజ్యసభ ఎంపీగా చేశారు. అదే కసబ్‌కు ఉరిశిక్ష పడేలా చేసిన న్యాయవాది ఉజ్వల్ నికమ్‌కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది.


ఫాక్ట్(నిజం): ప్రముఖ క్రిమినల్ లాయర్ మజీద్ మెమన్‌కు అజ్మల్ కసబ్ విచారణతో సంబంధం లేదు. ఆయన కసబ్ తరఫున వాదించలేదు. మజీద్ మెమన్‌ ఏప్రిల్ 2014 నుంచి ఏప్రిల్ 2020 వరకు NCP నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 2022లో మజీద్ మెమన్ ఎన్సీపీ(NCP)కి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరారు. ముంబై 26/11 ఉగ్రదాడి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేసిన ఉజ్వల్ నికమ్‌కు బీజేపీ ముంబై నార్త్ సెంట్రల్ ఎంపీ టికెట్ కేటాయించింది. అలాగే, కసబ్ తరఫున వాదించిన న్యాయవాదికి శరద్ పవార్ ఎంపీ టికెట్ ఇచ్చినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.


ఈ వైరల్ పోస్టులో చేసిన క్లెయిమ్‌లకు సంబంధించిన సమాచారం కోసం శోధించగా.. బీజేపీ న్యాయవాది ఉజ్వల్ నికమ్‌కు ముంబై నార్త్ సెంట్రల్ లోక్ సభ ఎంపీ సీటు ఇచ్చినట్లు 'Factly' నిర్ధారించింది. ముంబై 26/11 ఉగ్రదాడి విచారణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నికమ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఉజ్వల్ నికమ్ 1993 ముంబై వరుస పేలుళ్ల కేసు, శక్తి మిల్స్ సామూహిక అత్యాచారం కేసు, అహ్మద్‌నగర్ రేప్, హత్య కేసు వంటి అనేక ఇతర హై ప్రొఫైల్ కేసుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కూడా పనిచేశారు.


26/11 ముంబై ఉగ్రదాడుల కేసులో అజ్మల్ కసబ్ తరపున వాదించడానికి ఏ న్యాయవాది ఆసక్తి చూపనందున, ఈ కేసులో న్యాయమైన విచారణ జరిగేలా, కసబ్‌కు న్యాయ సహాయం అందించడానికి న్యాయస్థానమే పలువురు న్యాయవాదులను నియమించింది. నిందితుడికి న్యాయమైన, పారదర్శకమైన విచారణకు హక్కు ఉంది, నిందితుడి తరఫున ఎవరూ వాదించకపోతే అది అసాధ్యం. అందువల్లే ఈ కేసులో కసబ్‌ తరఫున వాదించడానికి న్యాయస్థానమే పులువురు న్యాయవాదులను నియమించింది. ఈ కేసు విచారణ మొదటి దశలో కసబ్ లాయర్‌గా అబ్బాస్ కజ్మీని న్యాయస్థానం నియమించింది. కానీ తరువాత సహకరించని కారణంగా అబ్బాస్ కజ్మీని తొలగించారు. ఆ తర్వాత కసబ్ డిఫెన్స్ లాయర్‌గా KP పవార్ నియమితులయ్యారు. విచారణలో ముఖ్యమైన సమయంలో కసబ్‌కు ప్రాతినిధ్యం వహించారు. కసబ్ తన మరణ శిక్షను బాంబే హైకోర్టులో అప్పీల్ చేసినప్పుడు, బాంబే హైకోర్టు కసబ్ తరఫున వాదించేందుకు న్యాయవాదులు అమీన్ సోల్కర్, ఫర్హానా షాలను నియమించింది. అలాగే, మరణశిక్షపై సుప్రీంకోర్టులో కసబ్ అప్పీల్ చేసిన సమయంలో రాజు రామచంద్రన్ కసబ్ న్యాయవాదిగా వ్యవహరించారు. గోపాల్ సుబ్రమణ్యం ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అజ్మల్ కసబ్ మరణశిక్షను సమర్ధిస్తూ వాదించారు.


అజ్మల్ కసబ్ విచారణతో భారతదేశంలోని ప్రముఖ క్రిమినల్ లాయర్ మజీద్ మెమన్‌కు ఎలాంటి సంబంధం లేదు, ఆయన కసబ్ తరఫున వాదించలేదు. పైగా ఆయన కసబ్‌ తరఫున వాదించేందుకు తనకు ఆసక్తి లేదని కూడా తెలిపినట్లు రిపోర్ట్స్ లభించాయి. మజీద్ మెమన్ 1993 ముంబై వరుస పేలుళ్ల వంటి పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేశారు. ఈ కేసులో చాలా మంది నిందితుల తరఫున ఆయన వాదించారు. అలాగే. పలు క్రిమినల్ కేసుల్లో పలువురు సినీనటులు, ప్రముఖుల తరఫున కూడా వాదించారు. మజీద్ మెమన్ ఏప్రిల్ 2014 నుంచి ఏప్రిల్ 2020 వరకు NCP నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. 2022లో మజీద్ మెమన్ ఎన్సీపీని(NCP) వీడి తృణమూల్ కాంగ్రెస్(TMC)లో చేరారు.


చివరగా, కసబ్ తరఫున వాదించిన న్యాయవాదికి శరద్ పవార్ ఎంపీ టికెట్ ఇచ్చినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదని 'Factly' స్ఫష్టం చేసింది.


This story was originally published by factly.in as part of the Shakti Collective. This story has been edited by ABPDesam staff.