Sakshi Dhoni: ఇండియా దిగ్గజ క్రికెటర్ ఎమ్ ఎస్ ధోనీ ఆయన భార్య సాక్షి ధోనీ సినిమా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోనీ ప్రొడక్షన్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ఇటీవలే ప్రారంభించారు. ఈ బ్యానర్ లో మొదటి సినిమాగా ‘ఎల్జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీ) అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాకు రమేష్ తమిళమణి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హరీష్ కళ్యాణ్, ఇవానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జులై 28 న సినిమా తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


ప్రస్తుతం అంత బడ్జెట్ నా దగ్గర లేదు: సాక్షి ధోనీ


‘ఎల్జీఎం’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మూవీ నిర్మాత సాక్షి ధోనీ విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. అయితే తెలుగులో ఉన్న స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి వారితో సినిమాలు తీస్తారా అని అడిగిన ప్రశ్నకు సాక్షి ఇచ్చిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం తన వద్ద అంత డబ్బు లేదని చెప్పింది సాక్షి. వాళ్లు స్టార్ హీరోలు, పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలు చేస్తున్నారు. వారితో సినిమా చేయాలి అనుకుంటే తాము భారీ రెమ్యూనరేషన్ లు ఇవ్వాలి. తాము ఇప్పుడే నిర్మాణ రంగంలో అడుగు పెట్టామని, ‘ఎల్జీఎం’ సినిమా తొలి అడుగు అని చెప్పింది. భవిష్యత్ లో వారితో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తామని చెప్పింది సాక్షి. అలాగే తాను అల్లు అర్జున్ కు వీరాభిమానినని సాక్షి వెల్లడించింది. ఎప్పటి నుంచో ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని, అల్లు అర్జున్ సినిమాలు అన్నీ చూస్తానని చెప్పిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.


తెలుగులో ఆగస్టు 4 న ప్రేక్షకుల ముందుకు ‘ఎల్జీఎం’..


‘ఎల్జీఎం’ సినిమా ధోనీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తోన్న మొదటి సినిమా. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించారు. అలాగే తెలుగులోనూ డబ్ చేశారు. ఈ సినిమాను రమేష్ తమిళమణి తెరకెక్కించారు. కామెడీ ఎంటర్టైనర్ జోనర్ లో సాగే ఈ సినిమాలో యోగిబాబు, మిర్చి విజయ్‌లు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే మూవీలో ధోనీ కనిపిస్తారా అని అడిగిన ప్రశ్నకు సాక్షి క్లారిటీ ఇవ్వలేదు. సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తుంది అంటూ సమాధానం ఇచ్చింది సాక్షి. తమిళ్ లో మూవీను జులై 28 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగులో ఇదే రోజు పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమా విడుదల కావడంతో తెలుగులో ఈ మూవీను నాలుగు రోజులు పోస్ట్ పోన్ చేశారు. ఆగస్ట్ 4 న ‘ఎల్జీఎం’ ను తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. 


Also Read: అలాంటి సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నా: మీనాక్షి చౌదరి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial