'వెళ్లిపోమాకే' సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమయ్యారు విశ్వక్ సేన్. ఆ తరువాత 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా చేశారు. ఈ సినిమాలో అతడి నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2019లో 'ఫలక్‌నుమాదాస్' చిత్రంతో దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా కూడా మారారు. ఆ సినిమాలో హీరో కూడా అతనే. ఆ సినిమా విశ్వక్ సేన్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తరువాత వచ్చిన 'హిట్' సినిమా హిట్టు కొట్టడంతో హీరోగా నిలబడ్డాడు విశ్వక్. ప్రస్తుతం మూడ్నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. 


రీసెంట్ గా అతడు నటించిన 'అశోకవనంలో అర్జున కళ్యాణం' సినిమాకి హిట్ టాక్ రావడంతో అతడు మరింత జోష్ తో తన సినిమాలను ముందుకు తీసుకెళ్తున్నారు. కొన్నిరోజుల క్రితం 'దాస్ కా దమ్కీ' అనే సినిమా అనౌన్స్ చేశారు విశ్వక్ సేన్. ముందుగా ఈ సినిమాకి దర్శకుడిగా నరేష్ కుప్పిలిని తీసుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ అతడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీంతో దర్శకత్వ బాధ్యతలు విశ్వక్ సేన్ చేపట్టారు. 


ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అందులో ఒకటి హీరో రోల్ కాగా.. మరొకటి విలన్ రోల్ అని సమాచారం. కథ ప్రకారం.. హీరో, విలన్ రెండూ విశ్వక్ సేనే. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో తన తండ్రిని నిర్మాతగా పెట్టి సినిమా చేస్తున్నారు ఈ యంగ్ హీరో. మరి ఈ సినిమా అతడికి ఎలాంటి హిట్ ను తీసుకొస్తుందో చూడాలి!


ఈ సినిమాలో నివేతా పేతురేజ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి దినేష్ బాబు ఛాయాగ్రాహకుడు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ అందించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.


Also Read: కాజల్ అగర్వాల్ కుమారుడిని చూశారా? ఫస్ట్ ఫొటో బయటకు వచ్చేసింది!