సినిమా పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నందమూరి తారక రామారావు మొదలుకొని జూనియర్ ఎన్టీఆర్ వరకు ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. సక్సెస్ ఫుల్ హీరోలుగా రాణిస్తున్నారు. త్వరలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ విషయాన్ని బాలయ్యే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఆయన ఫ్యామిలీ నుంచి మరో సినీ వారసుడు రెడీ అవుతున్నాడు. అతనెవ్వరో కాదు.. బాలయ్య మనవడే. 


మాస్ డైలాగ్ తో అదరగొట్టిన బాలయ్య మనువడు


తాజాగా బాలయ్య, మలినేని గోపీచంద్ కాంబోలో ‘వీరసింహారెడ్డి’ సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో జరిగింది. ఈ వేడుకలో బాలయ్య మనువడు ఆర్యవీర్ కు సంబంధించిన ఓ వీడియోను ప్రదర్శించారు. ఇందులో ఆర్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్పి అదరగొట్టాడు. ‘‘భయం నా బయోడేటాలో లేదురా’’ అనే డైలాగ్ చెప్పి శభాష్ అనిపించాడు. ఈ వీడియో ‘వీర సింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్లే కావడంతోనే బాలయ్య అభిమానులు ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో సినీ వారసుడు రాబోతున్నాడంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.   






అభిమానులను ఊర్రూతలూగిస్తున్న‘వీరసింహారెడ్డి‘ ట్రైలర్  


అటూ బాలయ్య ‘వీరసింహారెడ్డి‘ సినిమాకు సంబంధించి తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మాస్, ఊరమాస్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ట్రైలర్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. బాలయ్య డైలాగులు ఎలా ఉండాలని అభిమానులు కోరుకుంటారో, అదే స్థాయిలో ఈ ట్రైలర్ కట్ చేయించారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా, వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ హీరో దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’తో పాటు పలు సినిమాలతో ఈ చిత్రం పోటీకి సై అంటోంది.


Read Also: ‘పఠాన్’కు పాట్లు - బాయ్‌కాట్‌పై బాలీవుడ్ కలవరం, కేంద్రాన్ని ఆశ్రయించిన సినీ పెద్దలు