Etv Vinayaka Chavithi Special Event Promo: పండగలు వస్తే చాలు.. బుల్లితెరపై ఓ రేంజిలో సందడి ఉంటుంది. ఆడియెన్స్ ను ఆకట్టుకునేందుకు ఆయా చానెళ్లు అదిరిపోయే షోలను ప్లాన్ చేస్తుంటాయి. మిగతా చానెల్స్ ఎలా ఉన్నా, స్పెషల్ షోలను చేయడంలో ఈటీవీ ముందు ఉంటుంది. జబర్దస్త్ కమెడియన్లతో పాటు పలువురు నటీనటులతో స్పెషల్ ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. త్వరలో వినాయక చవితి పండుగ వస్తుండటంతో స్పెషల్ షోను ప్లాన్ చేసింది. ‘జై జై గణేశా’ పేరుతో ఈ షోను రూపొందించింది. తాజాగా ఈ స్పెషల్ ఈవెంట్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది.

  


ఆకట్టుకుంటున్న ‘జై జై గణేశా’ ప్రోమో


వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న ఈ స్పెషల్ షో టెలీకాస్ట్ కానుంది. తాజాగా ప్రోమోలో సీనియర్ హీరోయిన్లు ఇంద్రజ, కుష్బూ సంప్రదాయ దుస్తుల్లో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఎప్పటిలాగే హాట్ బ్యూటీ రష్మీ గౌతమ్ యాంకర్ గా చేసింది. తన చలాకీ మాటలు, అందచందాలతో ఆకట్టుకుంది. నటుడు శివాజీ, ‘బలగం’ బ్యూటీ కావ్యా కల్యాణ్ రామ్ స్పెషల్ గెస్టులుగా వచ్చారు. కావ్యా కల్యాణ్ రామ్ కీ బోర్డును వాయిస్తూ అందరినీ ఆకట్టుకుంది. తను బాలనటిగా చేసినప్పటి ‘వల్లంగి పిట్ట’ పాటను కీబోర్డు మీద పలికించి అందరి చేత వారెవ్వా అనిపించుకుంది. ఇక జబర్దస్త్ కమెడియన్లు చేసిన కామెడీ, ఒకరిపై మరొకరు వేసుకున్న పంచులు అందరినీ హిలేరియస్ గా నవ్వించాయి. ఈ షోలో భాగంగా నిర్వహించిన ఫన్నీ టాస్కులు కడుపుబ్బా నవ్వించాయి. సరదా సరదాగా సాగిన ఈ ప్రోమో అందరినీ ఆకట్టుకుంటుంది.  


ఆకట్టుకుంటున్న రష్మి స్పెషల్ సాంగ్


‘జై జై గణేశా’ ప్రోమోలో స్పెషల్ గా చెప్పుకోవాల్సిన విషయం యాంకర్ రష్మి చేసిన స్పెషల్ సాంగ్. ‘మురారి’ సినిమాలోని ‘చెప్పమ్మా.. చెప్పమ్మా’ అనే పాటకు రష్మి అదిరిపోయే డ్యాన్స్ చేసింది. పల్చటి పసుపు రంగు చీర కట్టుకుని మత్తెక్కించే ఎక్స్ ప్రెషన్స్ తో ఆహా అనిపించింది. ఆకుపచ్చని పంట పొలాల నడుమ చిత్రీకరించిన ఈ పాట అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే ఈ పాటలోనూ రష్మి అందాల ఆరబోతతో కుర్రకారును కట్టిపడేసింది. రష్మీ సాంగ్ ‘జై జై గణేశా’ ప్రోమోలో హైలెట్ గా నిలిచింది.  


రష్మి డ్యాన్స్ కోసమే ‘జబర్దస్త్’ చూస్తున్నానన్న శివాజీ


ఇక ‘జై జై గణేశా’ ప్రోమో చివరల్లో నటుడు శివాజీ రష్మీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ‘జబర్దస్త్’ చూసేదే రష్మి డ్యాన్స్ కోసం అన్నారు. ప్రస్తుతం శివాజీ కామెంట్స్ తో పాటు ‘జై జై గణేశా’ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మొత్తంగా గణేష్ పండగ రోజు ఈటీవీ షో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నట్లు అర్థం అవుతోంది. ఇక ఈ షోకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.  



Read Also: బన్నీపై పవన్‌ అలాంటి కామెంట్స్‌! 'పుష్ప' నిర్మాత స్పందన - బర్త్‌డేకు 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' నుంచి సర్‌ప్రైజ్‌