రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరిల కాంబినేషన్‌లో స్పై థ్రిల్లర్ తెరకెక్కించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో విజయ్ దేవరకొండ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.


ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తుంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎడిటర్‌గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలు గిరీష్ గంగాధరన్ నిర్వర్తిస్తున్నారు.






ఈ సినిమా ప్రీ లుక్ / స్పెషల్ పోస్టర్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను ఒకసారి చూస్తే పియానో తరహాలో ఉన్న ఓ పోస్టర్, కాగితపు ముక్కలపై విజయ్ దేవరకొండ రూపం! సినిమాలో ఆయన గూఢచారిగా కనిపించనున్నారని చిత్ర బృందం మరోసారి పేర్కొంది. 


'నేను ఎవరిని మోసం చేశానో చెప్పడానికి... నేను ఎవరికి చెందిన వాడినో తెలియదు - ఓ అజ్ఞాత గూఢచారి' అని పోస్టర్ మీద రాసి ఉంది. సినిమా అనౌన్స్ చేసినప్పుడు కూడా ఆ కోట్ పేర్కొన్నారు. ఈ రోజు స్పెషల్ పోస్టర్ విడుదల చేసిన సందర్భంగా 'ప్రతి గూఢచారి కథ ముగియడం వెనుక ఓ గూడుపుఠాణి ఉంటుంది. అయితే, వారి వెనుక ఉన్న నిజం ఎప్పటికీ బయటకు రాదు' అని చిత్ర బృందం పేర్కొంది. ఈ వ్యాఖ్యలు సినిమాపై ఆసక్తి కలిగించాయి.


గూఢచారిగా విజయ్ దేవరకొండ కథ ఏమిటి? ఆయన వెనుక ఉన్న నిజం ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే... సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాలి. గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ కలయికలో తొలి చిత్రమిది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.


సితార సంస్థలో గౌతమ్ తిన్ననూరి 'జెర్సీ' తీశారు. అది విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు... జాతీయ పురస్కారాలు కూడా తెచ్చి పెట్టింది. ఉత్తమ తెలుగు చిత్రంగా 'జెర్సీ' జాతీయ అవార్డు అందుకుంది. అలాగే, ఆ చిత్రానికి పని చేసిన నవీన్ నూలి ఉత్తమ ఎడిటర్ అవార్డు అందుకున్నారు. 'పీరియడ్ డ్రామాగా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దీనికి ఎంతో మంది ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని నిర్మాతలు చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా కాకుండా శివ నిర్వాణ దర్శకత్వంలో 'ఖుషి' సినిమా చేస్తున్నారు విజయ్ దేవరకొండ. అందులో సమంత కథానాయిక. ఆ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.