ఓ మరణం నుంచి కోలుకోక ముందు మరో మరణ వార్తను ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ ప్రముఖులు వినక తప్పని పరిస్థితి. కాశీనాథుని విశ్వనాథ్ మరణాన్ని ఇంకా ఎవరూ జీర్ణించుకోలేదు. అంతలో మరో దిగ్గజం మనల్ని వదిలి వెళ్ళారు. 


లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ (Vani Jayaram) ఇకలేరు. ఈ రోజు తుదిశ్వాస విడిచారు. వాణీ జయరామ్ వయసు 78 ఏళ్ళు. చెన్నైలోని నాగంబాక్కంలో గల హద్డౌస్ రోడ్డులోని ఆమె ఇల్లు ఉంది. అక్కడ ప్రమాదం జరిగింది. ఆస్పత్రికి తీసుకువెళ్ళగా... కన్ను మూశారు. తలకు గాయం కావడంతో ఆమె మరణించినట్లు ప్రాధమిక సమాచారం అందుతోంది. ఆమె మృతి మిస్టరీగా మారింది. 


ఇటీవల పద్మభూషణ్ ప్రకటన  
వాణీ జయరామ్ చిత్రసీమకు చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మొన్న గణతంత్ర దినోత్సవం నాడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలోని మూడో అత్యున్నత పురస్కారంతో ఆమె సత్కరించింది. ఆ అవార్డు అందుకోక ముందు ఆవిడ కన్ను మూయడం విషాదమని అభిమానులు, ప్రేక్షకులు విలపిస్తున్నారు.


మూడు జాతీయ పురస్కారాలు... 
రెండు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే!
Vani Jayaram National Award Songs : వాణీ జయరామ్ ఉత్తమ గాయనిగా మూడు సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగాళ్' సినిమా (తెలుగులో 'అంతులేని కథ')లో పాటలకు గాను ఒకసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. మిగతా రెండు సార్లు కె. విశ్వనాథ్ సినిమాల్లో పాటలు అందుకోవడం విశేషం.
 
'శంకరాభారాగం'లో పాటలకు 1980లో, ఆ తర్వాత 'స్వాతి కిరణం' సినిమాలో 'అనాతనీయరా హరా...' పాటకు 1991లో మరోసారి వాణీ జయరామ్ జాతీయ పురస్కారం అందుకున్నారు. విశ్వనాథ్ మరణించిన రెండు రోజులకు ఆవిడ కన్ను మూయడం విషాదకరం. 


అసలు పేరు వాణీ జయరామ్ కాదు
వాణీ జయరామ్ అసలు పేరు కలైవాణి. తమిళనాడులోని వెల్లూరులో అయ్యంగార్ కుటుంబంలో నవంబర్ 30, 1945 జన్మించారు. కర్ణాటక సంగీతంలో చిన్నతనం నుంచి శిక్షణ తీసుకున్నారు. ఎనిమిదేళ్ళ వయసులో తొలి ప్రదర్శన ఇచ్చారు. చదువు పూర్తైన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేశారు. ఆమె మామగారు కూడా కర్ణాటిక్ సింగర్ కావడంతో ఆయన ప్రోత్సాహంతో గాయనిగా అడుగులు వేశారు.


గాయనిగా 50 ఏళ్ళు...
సుమారు 10 వేల పాటలు
'గుడ్డీ' సినిమాతో వాణీ జయరామ్ చిత్రసీమకు పరిచయం అయ్యారు. అందులో తొలి పాటకు ఐదు అవార్డులు ఆదుకున్నారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్ పురి, ఒరియా, తుళు భాషల్లో పాటలు పాడారు. ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. వాణీ జయరామ్ 50 ఏళ్ళ కెరీర్ లో మొత్తం మీద 10 వేల పాటలకు పైగా పాడారు. అందులో తెలుగు పాటలు వెయ్యి కంటే ఎక్కువే. 


Also Read : కళా తపస్వికి తెలుగు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వలేదా? ఆయన స్థాయికి అది అవమానమేనా?


'మరో చరిత్ర', 'శంకరాభరణం', 'సీతాకోక చిలుక', 'శ్రుతి లయలు', 'స్వర్ణ కమలం', 'స్వాతి కిరణం', 'ప్రేమాలయం' తదితర సినిమాల్లో వాణీ జయరామ్ పాడిన పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఎమ్మెస్ విశ్వనాథన్, కేవీ మహదేవన్, ఇళయరాజా, ఆర్.డి. బర్మన్, ఓపీ నయ్యర్, మోహన్ మోహన్ తదితర దిగ్గజ సంగీత దర్శకుల స్వరాలకు వాణీ జయరామ్ గాత్రం ప్రాణం పోసింది. 


Also Read : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'కు ఎండ్ కార్డు వేసిన రోజే 'నిజం విత్ స్మిత' మొదలు