వాణీ జయరామ్ (Vani Jayaram Death) మృతిపై ఇంకా మిస్టరీ వీడలేదు. ఆమెకు ఏమైంది? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దిగ్గజ గాయని శనివారం నాడు చెన్నైలోని నాగంబాక్కంలో గల హద్డౌస్ రోడ్డులోని సొంత ఇంటిలో వాణీ జయరామ్ ప్రమాదానికి గురి అయ్యారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె గాయాలు పాలు కావడంతో అనుమానాలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకోవడం కూడా వాణీ జయరామ్ అభిమానుల్లో, ప్రేక్షకుల్లో మరిన్ని సందేహాలకు కారణం అవుతోంది. ఇప్పుడు తలపై గాయం నిజమేనని పోలీసులు నిర్ధారించారు.
 
పోస్టుమార్టం పూర్తి...
తలపై గాయం నిజమే!
వాణీ జయరామ్ పార్థీవ దేహానికి శనివారం పోస్టుమార్టం పూర్తి అయ్యింది. అందులో తలపై ఒకటిన్నర ఇంచు గాయం ఉన్నట్లు గుర్తించారు. అయితే... అది ఎలా అయ్యింది? అందుకు కారణాలు ఏమిటి? అనేది ఇంకా తెలియ రాలేదు. పోస్టు మార్టం పూర్తి నివేదిక వచ్చిన తర్వాత గాయం విషయమై పూర్తి స్పష్టత ఇస్తామని వైద్యులు తెలిపారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 



మధ్యాహ్నం అంత్యక్రియలు
చెన్నైలో ఈ రోజు (ఆదివారం) మధ్యాహ్నం ఒంటి గంటకు వాణీ జయరామ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆమె మృతిపై గాయనీ గాయకులు, చిత్రసీమ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 


Also Read : కళా తపస్వికి తెలుగు ప్రభుత్వాలు గౌరవం ఇవ్వలేదా? ఆయన స్థాయికి అది అవమానమేనా? 



వాణీకి ఏమైంది?
ఇంట్లో ఏం జరిగింది?
వాణీ జయరామ్ ఇంట్లోని గ్లాస్ టేబుల్ మీద పడటంతో ఆమె ముఖానికి బలమైన గాయాలు అయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ రోజు (శనివారం) ఉదయం ఆ ఘటన జరిగిందట. ఆ సమయంలో ఎవరూ లేరట. ఇంట్లో వాణీ జయరామ్ ఒక్కరే ఉంటారు. పని మనిషి వచ్చి తలుపు కొట్టగా వాణీ జయరామ్ ఎంత సేపటికీ తలుపు తీయక పోవడంతో బంధువులకు సమాచారం అందించగా... వెంటనే వచ్చారు. 


తలుపు తీసి ఇంట్లోకి వెళ్ళే సరికి వాణీ జయరామ్ రక్తపు మడుగులో ఉన్నారట. దాంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తీసుకు వెళ్ళగా... చికిత్స చేయడం ప్రారంభించారు. కొంత సేపటికి తుది శ్వాస విడిచారని తెలిసింది. పని మనిషి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 


Also Read : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్  


వాణీ జయరామ్ రక్తపు మడుగులో పడి ఉండటం కూడా అనుమానానికి కారణంగా కనిపిస్తోంది. కాలుజారి పడటం జరిగిందా? లేదంటే ఇంట్లోకి ఎవరైనా చొరబడి ఏమైనా చేశారా? అనేది తెలియాల్సి ఉంది. 


వాణీ జయరామ్ అసలు పేరు కలైవాణి. తమిళనాడులోని వెల్లూరులో అయ్యంగార్ కుటుంబంలో నవంబర్ 30, 1945 జన్మించారు. 'గుడ్డీ' సినిమాతో వాణీ జయరామ్ చిత్రసీమకు పరిచయం అయ్యారు. అందులో తొలి పాటకు ఐదు అవార్డులు ఆదుకున్నారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ, కన్నడ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్ పురి, ఒరియా, తుళు భాషల్లో పాటలు పాడారు. ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. వాణీ జయరామ్ 50 ఏళ్ళ కెరీర్ లో మొత్తం మీద 10 వేల పాటలకు పైగా పాడారు. అందులో తెలుగు పాటలు వెయ్యి కంటే ఎక్కువే. 


వాణీ జయరామ్ ఉత్తమ గాయనిగా మూడు సార్లు జాతీయ పురస్కారం అందుకున్నారు. కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 'అపూర్వ రాగంగాళ్' సినిమా (తెలుగులో 'అంతులేని కథ')లో పాటలకు గాను ఒకసారి జాతీయ పురస్కారం అందుకున్నారు. మిగతా రెండు సార్లు కె. విశ్వనాథ్ సినిమాల్లో పాటలు అనుకోవడం విశేషం. చిత్రసీమకు ఆమె చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం మొన్న గణతంత్ర దినోత్సవం నాడు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. అది అందుకోక ముందు కన్నుమూయడం విషాదమని అభిమానులు, ప్రేక్షకులు విలపిస్తున్నారు.