'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' సినిమాతో హీరోగా మారారు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో అందరి దృష్టి అతడిపై పడింది. ఆ తరువాత 'కొండపొలం' అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం ఈ హీరో నటించిన 'రంగ రంగ వైభవంగా' సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. 


గిరీశయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవ్ తేజ్ 'అలీతో సరదాగా' షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. 'శంకర్ దాదా సినిమాలో మీ మావయ్య(చిరంజీవి)తో కలిసి నటించావ్. అప్పుడు ఆయన ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చేవారా..?' అని ప్రశ్నించగా.. 'ఆ సినిమాలో నా పాత్ర అసలు కదలకూడదు. కళ్లు కూడా ఆర్పకూడదు. అయితే ఓ సీన్ లో బాగా నవ్వేశాను. దీంతో మావయ్యకి చాలా కోపం వచ్చింది. సీరియస్ అయ్యారు' అంటూ చెప్పుకొచ్చారు. 


'ఇంట్లో తేజ్ అని పిలిస్తే ఎంత మంది పలుకుతారు..?' అనే ప్రశ్నకు.. 'చిరంజీవి గారు ఒరేయ్ అని పిలిస్తే చాలు.. అందరూ పలుకుతారు' అంటూ బదులిచ్చారు. 'ఉప్పెన స్క్రిప్ట్ ఎవరెవరు విన్నారనే' ప్రశ్నకు.. 'నాతో పాటు నా ఫ్రెండ్స్, ఆ తరువాత సుకుమార్,మైత్రి నిర్మాతలు కలిసి చిరంజీవి మావయ్యకి వినిపించారు. ఐడియా బాగుంది.. సినిమా తీయండి' అని ఆయన చెప్పారని గుర్తు చేసుకున్నారు వైష్ణవ్ తేజ్. 


'ఉప్పెన' సినిమాలో బేబమ్మ నీకో మాటా చెప్పాలనే సన్నివేశం కోసం ఇరవైకి పైగా టేక్స్ తీసుకున్నానని.. కానీ ఎన్ని సార్లు చేస్తున్నా ఎమోషన్ రావడం లేదని.. కానీ నాకోసం అందరూ వెయిట్ చేయడం చూసి.. అందరినీ ఇబ్బంది పెడుతున్నాననే ఫీలింగ్ తో కన్నీళ్లు వచ్చేశాయని చెప్పారు. అదే సినిమాలో రొమాంటిక్ సాంగ్ చేయడానికి ఇబ్బంది పడ్డానని తెలిపారు. ఇదే ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ నటించిన 'తమ్ముడు', 'బద్రి' సినిమాలు 120 సార్లు చూశానని చెప్పుకొచ్చారు. 



ఇక వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న 'రంగ రంగ వైభవంగా' సినిమా విషయానికొస్తే.. తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం ఎంతో ఫన్ గా నడిచింది. చిన్నతనంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ వలన హీరో, హీరోయిన్లు మాట్లాడుకోవడం మానేస్తారు. ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటారు. కాలేజ్, ఫ్యామిలీ ఇలా సరదాగా సాగిపోతున్న హీరో కొన్ని పరిస్థితుల కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేదే సినిమా.


కథ ప్రకారం.. హీరో హీరోయిన్లు ఇద్దరూ డాక్టర్లుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో రాధాగా కేతికా శర్మ, రిషి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు.  ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందిస్తుండగా... శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా 'ఉప్పెన' సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్.


Also Read: 'విక్రమ్ వేద' టీజర్ - మక్కీకి మక్కీ దించేశారుగా!


Also Read: 'లైగర్' పరిస్థితి నార్త్ ఇండియాలో ఎలా ఉందంటే?