ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోగా సినిమాలు చేశారు వేణు తొట్టెంపూడి. ఆయన కెరీర్ లో చాలా హిట్స్ ఉన్నాయి. అయితే కొన్నాళ్లుగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. చాలా కాలం తరువాత ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. రవితేజ నటిస్తోన్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు వేణు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారాయన. 

 

ఇటీవల ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించిన ఆయన తాజాగా అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ షోలో అలీతో చాలా విషయాల గురించి ముచ్చటించారు వేణు. నిజానికి తనను వెండితెరకు భారతీరాజా పరిచయం చేయాల్సింది కానీ మిస్ అయిందని చెప్పారు. తను నటించిన 'చిరునవ్వు' సినిమాలో ఒక్క క్లైమాక్స్ కోసం నాలుగు నెలలు వెయిట్ చేశామని గుర్తు చేసుకున్నారు. 

 

ఇక వేణుపై సెటైర్ వేస్తూ.. తనను మొదటి సారి చూసినప్పుడు చాలా వినయంగా ప్రవర్తించాడని.. ఈ అబ్బాయ్ ఏంటి కావాలని నటిస్తున్నాడా..? లేక మోస్తున్నాడా..? అనుకున్నానని అలీ అప్పట్లో వేణు ఎలా ఉండేవారో చెప్పారు. తన మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు అలీ తనను వేలు పట్టుకొని నడిపించారని.. ఇప్పుడు తను వేసుకున్న షర్ట్ కూడా అలీదే అంటూ నవ్వులు పూయించారు వేణు. 

 

ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా కథ ఏంటి..? అని ఆలీ అడగ్గా.. ఆ సినిమా చేయకపోయినా  పూరి జగన్నాధ్ గారు మళ్లీ తన దగ్గరకు వచ్చారని చెప్పారు వేణు. ముందుగా అల్లు అర్జున్ నటించిన 'దేశముదురు' సినిమా కథ తనకే చెప్పారని.. హీరో క్యారెక్టర్ యాంకర్ అని, కవర్ చేయడానికి వేరే ప్లేస్ కి వెళ్తుందని ఇలా అన్నీ డిస్కస్ చేసి ఫైనల్ గా సినిమా మాత్రం తనతో చేయలేదని ఫన్నీగా చెప్పారు వేణు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.