Serial Actress Krishna Mukherjee: ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో మహిళలకు ఇబ్బందులు తప్పవేమో అని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ చాలావరకు హీరోయిన్లు.. ఈ విషయాన్ని ఓపెన్‌గా ఒప్పుకోవడానికి ఇష్టపడరు. కొందరు మాత్రమే తమకు జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి బయటపెడతారు. ఒక్కొక్కసారి హీరోయిన్లు బెదిరింపులకు భయపడి కూడా సైలెంట్‌గా తమకు జరిగిన అన్యాయం గురించి బయటపెట్టకుండా ఉండిపోతారు. కానీ ఒక బుల్లితెర నటి మాత్రం తనకు ఇలా జరిగిందంటూ ఓపెన్‌గా సోషల్ మీడియాలో ప్రకటించింది. రెండేళ్లుగా ఒక సీరియల్ నిర్మాత వల్ల తను ఎంత కష్టపడిందో వివరించింది.


లాభం లేదు..


2014లో సీరియల్స్‌లోకి ఎంటర్ అయ్యింది కృష్ణ ముఖర్జీ. తన కెరీర్ ప్రారంభం అయినప్పటి నుండి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు దక్కించుకుంటూ బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా మారిపోయింది. అదే క్రమంలో దంగల్ టీవీలో ప్రసారమయ్యే ‘శుభ్ షాగున్’ అనే సీరియల్‌లో నటించడానికి తనకు అవకాశం లభించింది. కానీ ఆ సీరియల్ వల్ల, దాని నిర్మాత వల్ల తనకు కష్టాలు మొదలయ్యాయి అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అసలు ఏం జరిగిందో వివరిస్తూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది కృష్ణ. ‘నేను ఇక్కడ సురక్షితంగా ఉన్నా అనుకోవడం లేదు. నేను చాలామందిని సాయం అడిగాను కానీ ఏం లాభం లేదు. ఎవరూ ఏం చేయలేకపోతున్నారు. నేను ఎందుకు ఏ షోలో నటించడం లేదని చాలామంది అడుగుతున్నారు. దానికి ఇదే కారణం’ అంటూ జరిగిన విషయాన్ని వివరించింది.


ఇతరుల మాటలు విని..


‘నా మనసులో ఉన్న విషయాన్ని బయటపెట్టే ధైర్యం నాకు ఇన్నాళ్లు లేదు. కానీ ఇంకా దీన్ని దాచిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. నేను చాలా కష్టమైన సమయాన్ని గడుపుతున్నాను. గత ఒకటిన్నర సంవత్సరం నాకు అస్సలు ఈజీగా గడవలేదు. నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఏడ్చాను. దంగల్ టీవీ కోసం శుభ్ షగున్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఇదంతా మొదలయ్యింది. అది నా జీవితంలో నేను తీసుకున్న చెత్త నిర్ణయం. నాకు ఆ సీరియల్ చేయాలనుకోలేదు కానీ ఇతరుల మాట విని కాంట్రాక్ట్‌పై సంతకం పెట్టాను. ఆ సీరియల్ ప్రొడక్షన్ హౌజ్, ప్రొడ్యూసర్ కుందన్ సింగ్ నన్ను చాలాసార్లు ఇబ్బందులు పెట్టారు. వాళ్లు నాకు పేమెంట్ ఇవ్వడం లేదని, నాకు ఆరోగ్యం బాలేదని షో చేయనని చెప్పానని ఒకసారి నన్ను మేకప్ రూమ్‌లో బంధించారు’ అని చెప్పుకొచ్చింది కృష్ణ ముఖర్జీ.


పట్టించుకోలేదు..


‘నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు నా మేకప్ రూమ్ డోర్లను బద్దలుకొట్టేంత పనిచేశారు. 5 నెలల నుండి నాకు పేమెంట్ ఇవ్వలేదు. అది నాకు చాలా పెద్ద అమౌంట్. నేను ప్రొడక్షన్ హౌజ్, దంగల్ టీవీ ఆఫీస్‌కు వెళ్లినా కూడా వాళ్లు నన్ను పట్టించుకోలేదు. అంతే కాకుండా నాకు చాలాసార్లు ధమ్‌కీ కూడా ఇచ్చారు. నాకు చాలా భయంగా ఉంది. నాకు న్యాయం కావాలి. ఇది టైప్ చేసేటప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. దీనివల్లే నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను. మనం ఎమోషన్స్‌ను లోపల దాచిపెట్టుకొని సోషల్ మీడియాలో కేవలం మంచిని మాత్రమే చూపిస్తాం. కానీ ఇదే రియాలిటీ. నన్ను వాళ్లు ఏమైనా చేస్తారేమో అని నా కుటుంబ సభ్యులు భయపడుతున్నారు’ అంటూ నిర్మాత కుందన్ సింగ్‌ను ట్యాగ్ చేసింది కృష్ణ ముఖర్జీ.






ఈ విషయంపై కుందన్ కూడా రియాక్ట్ అయ్యారు. ఆమె గతంలో కూడా ఇలా ఇద్దరిపై కేసులు పెట్టిందని.. ఇప్పుడు తనపై కూడా కావాలనే ఆరోపణలు చేస్తోందని ఇన్​స్టా పోస్ట్​లో తెలిపాడు. ఆమెపై లీగల్​గా వెళ్తున్నట్లు దానిలో వెల్లడించాడు. 


Also Read: హరీశ్ శంక‌ర్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన చోటా కే నాయుడు