Ramayan Serial on DD National: ‘రామాయణం’ పేరు మీద ఎన్నో సీరియల్స్, సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ 1987లో దూరదర్శన్‌లో ప్రసారమయిన ‘రామాయణ్’ సీరియల్‌కు ఏదీ సాటి రాదని అప్పటి ప్రేక్షకులు అంటుంటారు. అప్పట్లో దూరదర్శన్‌లో ఈ సీరియల్ ప్రసారమవుతుంటే కుటుంబమంతా కలిసి టీవీ ముందు కూర్చొని దీనిని చూసేవారు. కొన్నేళ్ల తర్వాత ‘రామాయణ్’ సీరియల్ పూర్తయినప్పటి నుంచి మరోసారి ఈ సీరియల్‌ను ప్రసారం చేస్తే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ కోరుకున్నారు. ఫైనల్‌గా ఇన్నేళ్ల తర్వాత ఫ్యాన్స్ కోరికను నెరవేర్చాలని డిసైడ్ అయ్యింది దూరదర్శన్.


మరోసారి ప్రేక్షకుల ముందుకు..


రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన ఈ ‘రామాయణ్’ టీవీ సీరియల్‌లో అరుణ్ గోవిల్ రాముడిగా, దీపికా చికిలియా సీతగా, సునీల్ లాహ్రి లక్ష్మణుడిగా నటించారు. ఇక ఈ సీరియల్‌తో వీరికి అమితంగా పాపులారిటీ లభించింది. ఇప్పటికీ చాలామంది వీరిని అవే పాత్రలతో గుర్తుపెట్టుకున్నారు. అందుకే తాజాగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి కూడా ఈ ముగ్గురు నటీనటులకు ప్రత్యేకంగా ఆహ్వానం దక్కింది. అక్కడ కూడా రీల్ లైఫ్ సీతారామ లక్ష్మణులు.. రియల్ లైఫ్‌లో అయోధ్యను దర్శించుకోవడానికి వచ్చారని నెటిజన్లు కామెంట్ చేశారు. ఇక ఇన్నాళ్లకు మరోసారి ప్రేక్షకులు ఎంతగానో మెచ్చిన ‘రామాయణ్’ సీరియల్ మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. డీడీ నేషనల్, ఇతరాత్ర రీజనల్ దూరదర్శన్ చానెళ్లలో కూడా ప్రసారం చేసే అవకాశాలున్నాయి.


650 మిలియన్ల వీక్షకులు..


37 ఏళ్ల తర్వాత మరోసారి ‘రామాయణ్’ దూరదర్శన్ నేషనల్ ఛానెల్‌లో ప్రసారమవుతున్నట్టు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. దూరదర్శన్ చరిత్రలోనే మరపురాని సీరియల్‌గా నిలిచిపోయిన ‘రామాయణ్’ను మరోసారి అదే ఛానెల్‌లో చూసే అవకాశం రావడంతో ప్రేక్షకులంతా సంతోషంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 1987, 1988 మధ్య డీడీ నేషనల్ ఛానెల్‌లో ఈ సీరియల్ ప్రసారమయ్యింది. అప్పట్లోనే ‘రామాయణ్2 17 దేశాలలో ప్రసారం చేయబడింది. డీడీ నేషనల్‌లాంటి 20 వేర్వేరు ఛానెల్స్‌లో ఈ సీరియల్‌ను వీక్షించారు ప్రేక్షకులు. ప్రపంచవ్యాప్తంగా ఈ సీరియల్‌కు 650 మిలియన్ల మంది వీక్షకులు ఉన్నారని ఒక ప్రకటనలో తేలింది.






మొత్తం 78 ఎపిసోడ్స్..


రెండేళ్లు ప్రసారమయిన ‘రామాయణ్’ సీరియల్‌లో పూర్తిగా 78 ఎపిసోడ్స్ ఉన్నాయి. ‘ధర్మం, ప్రేమ, త్యాగం గురించి చెప్పే అద్భుతమైన గాధ. భారత్‌లోని ప్రేక్షకులకు అన్నింటికంటే ఇష్టమైన షో రామాయణ్ మరోసారి రాబోతోంది. డీడీ నేషనల్‌లో చూడండి’ అంటూ డీడీ నేషనల్ అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ప్రకటించింది. ఇందులో అరుణ్ గోవిల్, దీపికా చికిలియా, సునీల్ లాహ్రిని ట్యాగ్ కూడా చేసింది. ఇప్పటివరకు ఈ రేంజ్‌లో ఏ టీవీ సీరియల్ హిట్ అవ్వలేదు. ఈ సీరియల్‌లో 78 ఎపిసోడ్స్ ఉండగా.. ప్రతీ ఎపిసోడ్‌కు రూ.40 లక్షలు లాభం వచ్చిందని ఒక రిపోర్ట్‌లో బయటపడింది. టీఆర్‌పీ రేటింగ్ విషయంలో కూడా ఇప్పటికీ ఇదే టాప్ సీరియల్‌గా స్థానం దక్కించుకుంది.


Also Read: శ్రీదేవికి ట్రక్కు నిండా పువ్వులు పంపిన అమితాబ్ బచ్చన్ - ఎందుకో తెలిస్తే షాకవుతారు