యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లితెరకు గ్లామర్ అద్దిన యాంకర్లలో ఆమె ఒకరు. తన డ్రెస్సింగ్ తో ఆడియన్స్ కు గ్లామర్ ట్రీట్ అందిస్తూ వచ్చింది. టీవీ షోలలో లభించిన పాపులారిటీతో అనసూయ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా గడిపేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా బిజీబిజీగా ఉంటూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. అలాగే, ట్రోలింగ్‌కు సైతం గురవుతూ ఉంటుంది. ఇద్దరు బిడ్డల తల్లి అలాంటి డ్రెస్సులు ధరించడం ఏంటి అంటూ తరచుగా నెటిజన్లు ఆమెపై నెగటివ్ కామెంట్స్ పెట్టడం, దానికి అనసూయ ఘాటుగా బదులిస్తూ వార్తల్లోకి ఎక్కడం సాధారణమైపోయింది. ఇదంతా పక్కన పెడితే.. అనసూయ టీవీ షోలు చేస్తున్నప్పుడు వచ్చిన క్రేజ్ ఇప్పుడు తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. అనసూయ కెరీర్ ఇప్పుడు రెంటికీ చెడ్డ రేవడిలా తయారయిందనే కామెంట్స్ వస్తున్నాయి.

 

కెరీర్ ప్రారంభంలో కొన్ని ఛానెల్స్ లో పని చేసిన అనసూయ.. 'జబర్దస్త్' కామెడీ షోలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుందనే సంగతి తెలిసిందే. కమెడియన్స్ హాస్యంతో నవ్వులు పూయిస్తుంటే.. అనసూయ తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది. ఎంత పోటీ ఉన్న తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సినిమా ఆఫర్స్ వచ్చినా తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన టీవీ రంగాన్ని మాత్రం వదులుకోలేదు.

 

అయితే అనసూయ సడన్ గా షాకింగ్ నిర్ణయం తీసుకొంది. టీవీ షోలని తగ్గించేయాలని ఫిక్స్ అయిపోయింది. తనకు నేమ్ ఫేమ్ తెచ్చిపెట్టిన ‘జబర్దస్త్’ కామెడీ షోని కూడా వదిలేసింది. సినీ కెరీర్ పై ఫోకస్ చేయాలనే ఉద్దేశంతోనే యాంకరమ్మ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఇండస్ట్రీలో పాగా వేయాలకున్న అనసూయకు ఇటీవల కాలంలో సరైన ఫిల్మ్స్ పడటం లేదు.

 

2003లో 'నాగ' చిత్రంలో చిన్న పాత్ర చేసిన అనసూయ.. చాలా గ్యాప్ తర్వాత 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాతో బిగ్ స్క్రీన్ మీద అలరించింది. దీంతో వరుస అవకాశాలు అందుకుంది. 'క్షణం', 'ఎఫ్ 2', 'మీకు మాత్రమే చెప్తా' యాత్ర చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 'రంగస్థలం' లో రంగమ్మత్త.. 'పుష్ప'లో దాక్షాయణి పాత్రలు ఆమెకు మంచి పేరు వచ్చింది. 'భీష్మ పర్వం' వంటి సక్సెస్ ఫుల్ మూవీతో మలయాళ ఇండస్ట్రీలనూ ఎంట్రీ ఇచ్చింది.

 

అయితే ఆ తర్వాత ఏ సినిమా కూడా అనసూయకు విజయాన్ని అందించలేదు. ‘ఖిలాడి’ మూవీ కాస్త పర్వాలేదనిపించినా.. ‘వాంటెడ్ పండుగాడ్’, ‘పక్కా కమర్షియల్’, ‘దర్జా’, ‘మైఖేల్’ వంటి చిత్రాలతో పరాజయాలు చవిచూసింది. 'భీష్మ పర్వం' తర్వాత మలయాళంలో ఆఫర్స్ వస్తాయనుకుంటే.. అదీ జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'రంగమార్తాండ', 'పుష్ప: ది రూల్' సినిమాపైనే బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రాలు తనకు మరిన్ని ఆఫర్స్ తెచ్చిపెడతాయని ధీమాగా ఉంది. మరి, అనసూయ మళ్లీ బుల్లితెరపై మెరుస్తుందా? లేదా సినిమాలకే పరిమితం అవుతుందా అనేది చూడాలి. అనసూయ చిన్న సైగ చేస్తే చాలు, బుల్లితెర అవకాశాలు కాళ్ల దగ్గరకు వస్తాయని ఆమె అభిమానులు ధీమాగా చెబుతున్నారు.