Brahmamudi Serial Today Episode: బాబుతో సహా రూంలోకి వెళ్లిన రాజ్ దగ్గరకు కావ్య వస్తుంది. తనను ఎందుకింత దగా చేశారని.. ఎందుకింత మోసం చేశారని నిలదీస్తుంది. మీరు సంవత్సరం నుంచి ముసుగులో ఉన్నారని ఇప్పుడే ఆ ముసుగు తొలగిపోయింది. అనాడు నేను తప్పు చేశానని నన్ను దూరం పెట్టారు. మరిప్పుడు దీన్నేం అంటారు. మీరు కలిసుందామని అంటారని ఆశపడ్డాను. ఇప్పుడు నేనేం చేయాలి. అసలు అందరం ఈ బిడ్డ గురించే మాట్లాడుతున్నాము.. ఈ బిడ్డను కన్నతల్లి ఎవరు? అంటూ నిలదీయడంతో రాజ్‌ బయటకు వెళ్లిపోతుంటే సమాధానం చెప్పి వెళ్లమని కావ్య అడుగుతుంది. ఇంతలో బాబు లేచి ఏడుస్తుంటే రాజ్‌ వచ్చి బాబుని ఎత్తుకుంటాడు. కావ్య బయటకు వెళ్లిపోతుంది. కింద కనకం, మూర్తి, అప్పు, ఇందిరాదేవి బాధగా కూర్చుని ఉంటారు.


కనకం: అమ్మ ఇది న్యాయమేనని మీరు అనుకుంటున్నారా? అమ్మా.. మీ మనవడి మనసులో ప్రేమ ఉందని దాన్ని బయటకు తీసుకురావాలని చెప్పారు. ఇప్పుడు నా బిడ్డ దేనికోసం ఎదురుచూడాలి. ఆ బిడ్డ తల్లి ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూడాలా?


మూర్తి: అమ్మా మీరు ఈ ఇంటి పెద్ద అందుకే మిమ్మల్నే న్యాయాన్యాయాలు అడగాల్సి వచ్చింది. నా కూతురిని బండరాయిగా బతకమని శాసించే హక్కు మీ మనవడికి లేదు అమ్మ.


ఇందిరాదేవి: మీ అమ్మాయికి నిజంగానే తీరని కష్టం వచ్చింది. ఒప్పుకుంటున్నాను. ఈ సమస్య రాగానే అంతా శూన్యంగా కనిపిస్తుంది. నన్ను క్షమించండి.


కనకం: మీర ఈ సమస్యకు ఓ పరిష్కారం చూడాలి.


అపర్ణ: ఏంటి చూసేది. ఈ ఇంట్లో ఎవరు ఎవర్ని ఓదార్చాలో మాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మా జీవితాలే తలకిందులయిపోయాయి. మా నమ్మకాలే ముక్కలయిపోయాయి.


కనకం: కన్నకూతురు కడుపులో చిచ్చు రగిలిపోతుంటే కన్నవాళ్లం మేము ఆ మాత్రం తల్లడిల్లిపోవడం నీకు తప్పుగా కనిపిస్తుందా? అమ్మా..


అపర్ణ: నీ కూతురు మా గడపలో కాలుమోపిన దగ్గరి నుంచే మా ఇంట్లో అరిష్టం చుట్టుకుంది.


కనకం: ఇంకోక ఆడదాన్ని తల్లిని చేయడమా? ఇంకోదానికి పుట్టిన బిడ్డని వారసుడు అంటూ ఈ ఇంటికి తీసుకురావడమా?


అంటూ కనకం మాట్లాడుతుంటే మీ కూతురుకు అంత కష్టంగా ఉంటే మీ కూతురుని మీరు తీసుకెళ్లిపోండి అంటుంది అపర్ణ. దీంతో కనకం పంపించండి నా కూతురు నాకు బరువేం కాదు. అనగానే కావ్య వచ్చి కనకాన్ని వారిస్తుంది. నేనేం తప్పు చేశానని రావాలి. ఆ పెద్దమనిషిని నిలదీయకుండా నేను ఇక్కణ్నుంచి రావాలా? ఎందుకు రావాలి నేను.  నిప్పును కూడా నీళ్లతో కడిగేంత నిఖార్సైన ఈ దుగ్గిరాల వంశం నాకు ఏం సమాధానం చెప్తుందో తెలుసుకునేదాకా  నేను కదిలేది లేదు. వదిలేది లేదు.. వచ్చేది లేదు.. సచ్చేది లేదు. ప్రశాంతంగా వెళ్లండి అప్పు నువ్వు తీసుకెళ్లవే.. అని చెప్తుంది కావ్య. అప్పు అమ్మానాన్నను తీసుకుని వెళ్తుంది. మరోవైపు దుష్టచతుష్టయం ఒకే దగ్గర చేరి మాట్లాడుకుంటుంటారు.


రుద్రాణి: ఇవాళ కావ్య పెళ్లి రోజు పెటాకులై పోయింది. నా కడుపు నిండిపోయింది.


అనామిక: ఇన్ని రోజులు ఈ ఇంటి పెద్దకోడలును అంటూ విర్రవీగిపోయింది. ఇప్పుడు భార్య స్థానమే పడిపోయింది.   


రుద్రాణి: ఇవాళ వారసుడు వచ్చాడు. రేపు వాడి కన్నతల్లి వస్తుంది. కావ్యకు సవతి వస్తుంది. రాజ్‌ బతుకు బజారున పడుతుంది.


ధాన్యలక్ష్మీ: రాజ్‌ పరువు బజారునపడితే పోయేది ఈ ఇంటి పరువే అది నీకు సంతోసాన్ని ఇవ్వడం ఏంటి?


అని రుద్రాణిని తిడుతుంది. రాహుల్‌ కూడా ధాన్యలక్ష్మీ చెప్పిందే నిజం అంటాడు. ఇంతలో అనామిక తెలివిగా రాజ్‌ తీసుకొచ్చిన బిడ్డనే వారసుడిగా ప్రకటిస్తే కళ్యాణ్‌ పరిస్థితి ఎంటి అంటూ చెప్పడంతో ధాన్యలక్ష్మీ అవును నువ్వు అనేది కరెక్టే.. అంటూ ఇప్పుడు ఆ బిడ్డను వెళ్లగొట్టేలా ప్లాన్‌ చేయాలి. రాజ్‌ను వెళ్లగొట్టి నా కొడుకుకు పట్టాభిషేకం జరిగేలా చేస్తాను అంటుంది ధాన్యలక్ష్మీ. మరోవైపు ఇందిరాదేవి కావ్యను ఓదారుస్తుంది. మరోవైపు ఇంటికి వెళ్లిన కనకం, మూర్తి, అప్పు, కావ్య గురించే ఆలోచిస్తుంటారు. ఇక ఎవరి కోసం అక్కడ కావ్య ఉండాలని కనకం బాధపడుతుంది. మరోవైపు కావ్య కృష్ణుడి దగ్గర నిలబడి తన బాధలు చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఇందిరాదేవి వెనక నుంచి అంతా వింటుంది. దగ్గరకు వచ్చి కావ్యను ఓదారుస్తుంది. రాజ్‌ ఈ తప్పు చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను అంటుంది కావ్య. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


ALSO READ: ఘనంగా ‘ఆర్‌సీ 16’ ఓపెనింగ్ - వీడియో విడుదల చేసిన మేకర్స్