పెళ్లి పీటల మీద కూర్చుంది కావ్య అని తెలియడంతో రాజ్ పెళ్లి చేసుకోనని వెళ్ళిపోతాడు. రాజ్ కుటుంబం కూడా వెళ్లిపోతుంటే కనకం ఏడుస్తూ తన కూతురి బతుకు నాశనం చేయవద్దని బతిమలాడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. అటు మీడియా కూడా దుగ్గిరాల కుటుంబం పేద ఇంటి అమ్మాయిని మోసం చేస్తుందని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. మరొక వైపు స్వప్న వెళ్ళిపోవడం వల్లే తన పరువు పోయిందని రాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అటు కావ్య కూడా రాజ్ ని పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంటుంది. కానీ ఇద్దరినీ ఒప్పించి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేస్తారు. ఇక ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ప్రోమోలో ఏముందంటే.. 


Also read: లాస్యకి వార్నింగ్ ఇచ్చిన నందు- విక్రమ్ ని అపార్థం చేసుకున్న దివ్య


పరువు కోసం రాజ్ కావ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇష్టం లేకపోయినా కావ్య కూడా రాజ్ తో మూడు ముళ్ళు వేయించుకుంటుంది. పెళ్లి అయిన తర్వాత రాజ్ ఇంటికి కోపంగా వస్తాడు. అప్పటికే ఇంట్లో ఉన్న రాజ్ తల్లి అపర్ణ కొడుకు కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాడు. పెళ్లి దుస్తుల్లో ఇంట్లోకి అడుగుపెడుతున్న రాజ్ ని గుమ్మం దగ్గరే ఆగమని మీ జంటకి ఎంత మంది దిష్టి తగిలిందో ఏంటోనని దిష్టి తీయాలని సంతోషంగా చెప్తుంది. స్వప్న ఏది ఎక్కడ ఉంది అనగానే కళ్యాణ్ పక్కకు జరుగుతాడు. తన వెనుక ఉన్న కావ్య మెడలో తాళితో వచ్చి రాజ్ పక్కన నిలబడే సరికి అపర్ణ షాక్ అవుతుంది. ఎలాంటి కుటుంబం మీది, ఎలాంటి వాళ్ళు మీరు, నువ్వు ఎప్పటికీ ఈ ఇంటికి కోడలివి కాలేవు వెళ్ళు ఇక్కడ నుంచి అని అపర్ణ సీరియస్ అవుతుంది. కావ్య అంటే గిట్టని అపర్ణ తనని కోడలిగా అంగీకరిస్తుందా లేదో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.. 


గురువారం నాటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. 


రాజ్ మోసగత్తె కావ్య మెడలో తాళి కట్టను అని వెళ్లిపోవడంతో మీనాక్షి స్త్రీ శక్తి అంటూ కాసేపు హడావుడి చేస్తుంది. కాలనీ ఆడవాళ్ళని వెంట పెట్టుకుని కావ్యని పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని గొడవ చేస్తుంది. తిక్క తిక్కగా మాట్లాడుతూ గోల చేస్తుంది. అదంతా అక్కడే ఉన్న మీడియా కవర్ చేస్తూ రాజ్ కి వ్యతిరేకంగా యాంకర్ వార్తలు చెప్తూ ఉంటుంది. దుగ్గిరాల కుటుంబం పేద ఇంటి అమ్మాయిని పెళ్లి పీటల మీదే వదిలేసిందని అంటారు. కృష్ణమూర్తి రాజ్ తాతయ్య దగ్గరకి వెళ్ళి క్షమాపణలు చెప్పి తన కూతురి జీవితం నాశనం చేయొద్దని వేడుకుంటాడు. పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే ఏమి అయ్యేది కాదు కానీ మీడియా వల్ల ఈ సంగతి అందరికీ తెలిసిపోయింది ఎక్కడికి వెళ్ళినా కూడా తన కూతురికి పెళ్లి కాదని దయచేసి అంగీకరించమని బతిమలాడతాడు. దీంతో రాజ్ తాతయ్య తనకి ధైర్యం చెప్పి రాజ్ ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు. ఇంటి పరువు కోసం రాజ్ కావ్యని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. అలా ఇద్దరికీ బ్రహ్మముడి పడుతుంది.