Mr Bachchan Flop Effect On Ustad Bhagath Singh: మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం భారీ అంచనాల నడుమ ఆగష్టు 15న విడుదలైంది. థియేటర్లలో ప్రేక్షకులను ఈ మూవీ ఏమాత్రం  ఆకట్టుకోలేకపోయింది. డైలాగులు, ఫైట్స్, పాటల.. ఏవీ ఆడియెన్స్ ను అలరించలేకపోయాయి. మరోవైపు చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మూవీలోని సీన్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. హరీష్ శంకర్ కెరీర్ తో పాటు రవితేజ కెరీర్ లోనూ అత్యంత చెత్త సినిమా ఇదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలోనే ఇంత దారుణమైన సినిమా ఎవరూ తీసి ఉండరంటూ విమర్శిస్తున్నారు. ఈ మూవీలోని సన్నివేశాలు, డైలాగులు చౌకబారుగా ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు. అసలు రవితేజ ఇలాంటి సినిమాను ఎలా ఒప్పుకున్నాడో అర్థం కావట్లేదంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ శంకర్ మాత్రం షోలు పెరుగుతున్న కొద్దీ పాజిటివ్ టాక్ వస్తోందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


‘ఉస్తాద్ భగత్ సింగ్’పై ‘మిస్టర్ బచ్చన్’ ఎఫెక్ట్


‘మిస్టర్ బచ్చన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన నేపథ్యంలో, ఈ ఎఫెక్ట్ హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై పడే అవకాశం ఉంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రెండవ సినిమాగా తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి 20 శాతం సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న ఆయన, త్వరలోనే తను అంగీకరించిన సినిమాలు పూర్తి చేసే అవకాశం ఉంది. ముందు 'OG', 'హరిహార వీరమల్లు' సినిమాలను కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్‌ సింగ్‌’ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. 'OG', 'హరిహార వీరమల్లు' సినిమాలకు కొన్ని డేట్స్‌ ఇస్తే సరిపోతుంది. ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’కు చాలా డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ‘మిస్టర్ బచ్చన్’ ఎఫెక్ట్ తో ఈ సినిమా ముందుకు సాగుతుందా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.  త్వరలోనే ఈ మూవీ భవిష్యత్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 


'హరిహర వీరమల్లు' షూటింగ్‌ షురూ


రీసెంట్ గా 'హరిహర వీరమల్లు' మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. స్టంట్ డైరెక్టర్ సిల్వ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ లేకుండానే ఈ షూటింగ్ ప్రారంభం అయ్యింది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ కు ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 



Read Also: ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో ‘కొటెషన్ గ్యాంగ్’ - కిరాయి హత్యల ముఠా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?