సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా తీసుకున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ సినిమా నిర్మిస్తోంది. మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమా (SSMB 28 Movie) ఇది.


ఈ సినిమా 'అతడు' స్టైల్ లో ఉంటుందని వార్తలొచ్చాయి. త్రివిక్రమ్ సినిమాల్లో  ఫ్యామిలీ, రిలేషన్స్, సెంటిమెంట్, ఎమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. వాటి మధ్యలో హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంటారు. ఆయన మొదటి సినిమా నుంచి ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం రూటు మారుస్తున్నారట. ఈ సినిమాలో ఫ్యామిలీ డ్రామాని పక్కన పెడుతున్నారట. 


మహేష్ తో స్టైలిష్ ఎంటర్టైనర్:


పూర్తిగా యాక్షన్ పై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ సీన్ ఈ సినిమాలో కనిపించవట. నిజానికి త్రివిక్రమ్ ఫ్యామిలీ సబ్జెక్టు రాసుకున్నప్పటికీ.. మహేష్ మాత్రం యాక్షన్ పై దృష్టి పెట్టమని అడిగారట. దీంతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో కీలకమార్పులు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆలస్యమైందని తెలుస్తోంది. మహేష్ పుట్టినరోజు నాడు ఈ సినిమా మొదలవుతుందని అందరూ అనుకున్నారు కానీ గిల్డ్ బంద్ కారణంగా కుదరలేదు. 


ఈ నెలాఖరు నుంచి సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి 'అర్జునుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. త్రివిక్రమ్ కి 'A' అనే అక్షరం చాలా సెంటిమెంట్. అందుకే ఇప్పుడు మహేష్ బాబుకి కూడా అదే లెటర్ తో మొదలయ్యే టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. కథకు కూడా 'అర్జునుడు' అనే టైటిల్ యాప్ట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీత దర్శకుడిగా పని చేయనున్నారు. ఈ సినిమా తరువాత మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.


విలన్ గా విజయ్ సేతుపతి:


సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించనున్నారని కొన్ని రోజుల క్రితం వినిపించింది. అసలు నిజం ఏంటంటే... విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నారు. అందులో కొన్ని గ్రే షేడ్స్ ఉంటాయి. విజయ్ సేతుపతి రీసెంట్‌గా కథ, అందులో తన క్యారెక్టర్ గురించి విన్నారు. సినిమాలో నటించడం తనకు సంతోషం అంటూ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది. 


మ్యూజిక్ సిట్టింగ్స్ షురూ:


ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. పాటలు ఎలా ఉండాలి? ఏయే సందర్భాల్లో వస్తాయి? అనే విషయాలను తమన్ తో డిస్కస్ చేశారు త్రివిక్రమ్. మహేష్, త్రివిక్రమ్ లతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నానంటూ తమన్ కొన్నిరోజుల క్రితం ఓ పోస్ట్ పెట్టారు. 


Also Read: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ


Also Read: అయ్యో రాధిక, నువ్వు లేని ‘డీజే టిల్లు’నా? సీక్వెల్‌లో ఆమె కనిపించదా?