సామ్ కోసం రూ.3 కోట్ల సెట్:


సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి, హరీష్ దర్శకులుగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో రూ. 3 కోట్ల రూపాయల ఖర్చుతో సెట్స్ వేశారు. ప్రస్తుతం ఆ భారీ సెట్స్‌లో కథలో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ముందుగా ఓ హోటల్ లో ఈ షూటింగ్ నిర్వహించాలనుకున్నామని.. కానీ 35, 40 రోజులు హోటల్స్‌లో చిత్రీకరణ చేయడం అంత ఈజీ కాదని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ వెల్లడించారు. అందుకే సీనియర్ కళా దర్శకుడు అశోక్ నేతృత్వంలో సెట్స్ రూపొందించామని.. నాన‌క్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ తీసుకుని వేసిన ఈ సెట్స్ కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పుకొచ్చారు నిర్మాత. డైనింగ్ హాల్, లివింగ్ రూమ్, కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ... సెవెన్ స్టార్ హోటల్‌లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశామని.. ఫిబ్రవరి 3న మొదలైన షెడ్యూల్ అక్కడే జరుగుతోందని చెప్పుకొచ్చారు. 






'సెబాస్టియన్‌ పిసి524' రిలీజ్ డేట్:


'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్‌ అబ్బవరం టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తన రెండో సినిమా 'ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం'తో కూడా మరో హిట్ అందుకున్నారు. తాజాగా మార్చి 4న 'సెబాస్టియన్‌ పిసి 524'తో హ్యాట్రిక్‌ హిట్‌ అందుకోవడానికి రెడీ అవుతున్నారు. జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో బాలాజీ సయ్యపురెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న ఈ సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది.