ప్రతి వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో, ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నాయి. అయితే, ఓటీటీల్లో ఈ సారి బ్లాక్ బస్టర్ సినిమాలు సందడి చేయబోతున్నాయి. థియేటర్లతో పోల్చితే ఓటీటీల్లోనే ఎక్కువ జోష్ కనిపించబోతోంది. సంక్రాంతి బరిలో నిలిచిన పెద్ద హీరోల సినిమాలన్నీ ఈ వారంలోనే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో దర్శనం ఇవ్వబోతున్నాయి. ఇక థియేటర్లలో మాత్రం చిన్ని సినిమాలు విడుదల కానున్నాయి.


ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు


‘వారసుడు’- ఫిబ్రవరి 22(అమెజాన్ ప్రైమ్)


తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన విజయ్ ‘వారసుడు’ కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంది. టాలీవుడ్ లో ఫర్వాలేదు అనిపించింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ బ్లాక్ బస్టర్ సినమా ఫిబ్రవరి 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఏమేరకు అలరిస్తుందో చూడాలి.    


‘వీరసింహారెడ్డి’- ఫిబ్రవరి 23( డీన్నీ+ హాట్ స్టార్)


నందమూరి బాలకృష్ణ నటించిన తాజాగా సినిమా ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ చిరంజీవి సినిమా ‘వాల్తేరు వీరయ్య’తో పోటీ పడింది. ఈ సినిమాల ఫిబ్రవరి 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రానుంది.   


‘మైఖేల్’-ఫిబ్రవరి 24(ఆహా)


యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన’మైఖేల్’ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఫిబ్రవరి 24 నుంచి ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. థియేటర్లలో ఆకట్టుకోలేని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చూడాలి.  


‘వాల్తేరు వీరయ్య’- ఫిబ్రవరి 27(నెట్‌ఫ్లిక్స్‌)


సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఫిబ్రవరి 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతోంది.  


థియేటర్లలో విడుదలకానున్న చిత్రాలు


‘మిస్టర్‌ కింగ్‌’


ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన సినమా ‘మిస్టర్‌ కింగ్‌’. శశిధర్‌ చావలి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యశ్విక నిష్కల, ఊర్వి సింగ్‌ హీరోయిన్లుగా నటించారు.  ఈ మూవీ ఫిబ్రవరి 24న థియేటర్‌లలో విడుదలకు రెడీ అయ్యింది.   


‘డెడ్‌లైన్‌’


అజయ్‌ ఘోష్‌ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా బొమ్మారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కింది.  తాండ్ర గోపాల్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 24న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  


‘కోనసీమ థగ్స్‌’


బృందా గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘కోనసీమ థగ్స్‌’. నిర్మాత శిబు తమీన్స్‌ కొడుకు హ్రిదు హరూన్‌ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. రియా శిబు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.


Read Also: దట్టమైన అడవిలో కుక్కలతో పోరాటం, ఒళ్లు గగుర్పొడిచేలా ఆండ్రియా `నో ఎంట్రీ` ట్రైలర్