సినిమా టికెట్ రేట్లు పెంచేయడంతో జనాలు ఎంతగా ఇబ్బంది పడ్డారో తెలిసిందే. 150 రూపాయల టికెట్ ను 300 వరకు పెంచేశారు. టాక్స్ లతో కలిపి రూ.350 వరకు అయ్యేది. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. ఎలాగో ఓటీటీలో వస్తుంది కదా అని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అందుకే ఈ మధ్యకాలంలో విడుదలవుతోన్న సినిమాలకు సరైన ఓపెనింగ్స్ రావడం లేదు. సినిమాకి హిట్ టాక్ వచ్చినా.. థియేటర్ కు వెళ్లి చూడడానికి జనాలు ఇష్టపడడం లేదు.


పెరిగిన రేట్లతో సొమ్ము చేసుకోవాలని చూసిన నిర్మాతలకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. దెబ్బకు టికెట్ రేట్లు తగ్గించడం మొదలుపెట్టారు. 'ఎఫ్3' సినిమాతో మొదలైన టికెట్ రేట్ల తగ్గింపు ఇప్పుడు 'థాంక్యూ' సినిమా వరకు వచ్చింది. సింగిల్ థియేటర్ రేటు రూ.100 ప్లస్ జీఎస్టీ అంటూ ప్రకటించారు. మల్టీప్లెక్స్ లో ఇదివరకు మాదిరి టికెట్ రేటు రూ.150గా అమ్మబోతున్నారు. 


ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కోసం ఇలా టికెట్ రేట్లు తగ్గింపు మార్గం చూసుకుంటున్నారు నిర్మాతలు. ఇక మిగిలిన సినిమాలు కూడా ఇదే రూట్ ఫాలో అవ్వాల్సి వస్తుందేమో. లేదంటే కలెక్షన్స్ పరంగా దెబ్బ పడడం ఖాయం. టికెట్ రేట్లు పెంచడం కోసం శ్రమించిన నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయనే తన సినిమాలకు రేట్లు తగ్గించి అమ్ముతున్నారు. ఈ స్టెప్ తో 'థాంక్యూ' సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయేమో చూడాలి!


Also Read :పవర్ స్టార్, లేడీ పవర్ స్టార్‌పై 'ప్రస్థానం' డైరెక్టర్ వరుస ట్వీట్లు - అసలు ఏమైందంటే?