ఓ సూపర్ హిట్ సినిమాలో చేసే పెద్ద హీరో, హీరోయిన్లు చిన్న సినిమాల్లో ఎందుకు చేయరు. అసలు సినిమా సూపర్ హిట్ అంటే ఏంటీ..? సినిమాకు రివ్యూ ఇవ్వటం ఎలా..? ఇలాంటి ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు డైరెక్టర్ దేవా కట్టా. ట్విట్టర్ లో నెటిజన్ల నుంచి ఎదురైన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారాయన. ఇంతకీ ఏం జరిగిందనేగా...!


దేవా కట్టా హీరోయిన్ సాయి పల్లవి లీడ్ రోల్ లో చేసిన 'గార్గి' చూశారంట. తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. సాయి పల్లవి కెరీర్ లో ఇదో మంచి సినిమాగా మిగిలిపోతుందన్న దేవా కట్టా... సినిమా రాసిన విధానం, తీసిన విధానం అద్భుతంగా ఉన్నాయంటూ 'గార్గి' టీంను ప్రశంసలతో ముంచెత్తారు.


ఆ తర్వాత కొన్ని గంటలకు సినిమాలకు రివ్యూలు ఇస్తున్న తీరుపై కాస్తంత అసహనంతో మరో ట్వీట్ చేశారు దేవా కట్టా. రివ్యూ ఇవ్వడం అంటే సినిమా కంటెంట్, ఇంటెన్షన్,  జోనర్ ఇంటిగ్రిటీ పై ప్రశంస లేదా విమర్శలా ఉండాలని దేవా కట్టా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందు కోసం ఆయన 2005 లో వచ్చిన అమెరికన్ పొలిటికల్ థ్రిల్లర్ 'సిరియానా'ను ఉదాహరణగా చెప్పుకొచ్చారు. అప్పటికే జార్జ్ క్లూనీ, మ్యాట్ డెమన్ లాంటి యాక్టర్స్ కు ఇండివిడ్యువల్ గా 10 కోట్ల డాలర్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్నా ఇద్దరూ కలిసి సిరియానాలో యాక్ట్ చేయటమే కాకుండా ప్రొడ్యూసర్స్ గానూ వ్యవహరించారని దేవా కట్టా గుర్తు చేశారు. సినిమా 3 కోట్ల డాలర్లే కలెక్ట్ చేసినా నేటికి దాన్ని సూపర్ హిట్ గా చెప్పుకుంటామని... మన సినిమాల్లోనూ అలాంటి మార్పులు, స్టాండర్డ్స్ రావాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


దేవా కట్టా ట్వీట్ కు కొంత మంది నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అమీర్ ఖాన్ గతంలో 'పిప్లీ లైవ్', 'తలాష్' లాంటి సినిమాలు చేశారని కానీ 'సిరియానా'లా నిలబడలేకపోయాయని చెప్పారు. దానికి బదులిచ్చిన దేవా కట్టా... ఆ రెండు మంచి సినిమాలేనని అన్నారు. రివ్యూ ఇవ్వటం అంటే ఓ సినిమాను ఎంత మంది చూస్తున్నారో లేదా ఎంత కలెక్ట్ చేసిందో, చేస్తుందో లెక్కలు వేసుకోవటం మాత్రమే కాదని మరో సారి ట్వీట్ చేశారు దేవా కట్టా. 'గార్గి' లాంటి సినిమాను తెలుగులో ఎక్కువగా రివ్యూ చేయటం ద్వారా అలాంటి కాన్సెప్టులను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలని కోరుతున్నానన్నారు దేవా కట్టా.


ఓటీటీ లేకపోవటం వల్ల 'సిరియానా', 'పిప్లీ లైవ్' లాంటి సినిమాలను జనాలు పట్టించుకోలేదని... ఇప్పుడు ఓటీటీ వచ్చాక కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల కోసం థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపించట్లేదని మరికొంత మంది అభిప్రాయాలు చెప్పారు. మరో నెటిజన్ దేవాకట్టా తన 'రిపబ్లిక్ ' లాంటి సినిమా సాయి ధరమ్ తేజ్ తో కాకుండా పవన్ కల్యాణ్ తో చేసి ఉండుంటే జనాల్లోకి వెళ్లి ఉండేది కదా అని ప్రశ్నించారు.


Also Read : పది కథల్ని పక్కన పెట్టేసిన స్టార్ ప్రొడ్యూసర్ 'దిల్' రాజు, రెండు షూటింగులూ


నెటిజన్ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన  దేవా కట్టా... తనతో సహా సాయి ధరమ్ తేజ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉండే వాళ్లమన్నారు. రిపబ్లిక్ సినిమా పవన్ కల్యాణ్ చేయాల్సిన సినిమానేనన్న దేవా కట్టా... కానీ ఆ క్లైమాక్స్ ను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకోరని బలంగా నమ్మిన తర్వాతే... పంజా అభిరామ్ అనే ఆ పాత్ర ను రిపబ్లిక్ లో సాయి ధరమ్ తేజ్ పోషించారని క్లారిటీ ఇచ్చారు దేవా కట్టా. సో సాయిపల్లవి 'గార్గి'కి మద్దతుగా నిలబడటంతో పాటు 'రిపబ్లిక్' సినిమాను పవన్ కల్యాణ్ చేయాల్సిందన్న కొత్త విషయాన్ని ట్వీట్స్ ద్వారా తెలియచేశారన్న మాట దేవా కట్టా.


Also Read : తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సభ్యులు జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్మాతలు చర్చించబోయే అంశాలు ఇవే