తమిళనాట మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. విజయ్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. నిజానికి లోకేష్ గత సినిమా ‘విక్రమ్’ విడుదల అయ్యే సమయానికే ఈ సినిమా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. నెల క్రితమే అధికారికంగా లాంచ్ అయి, షూటింగ్ కూడా ప్రారంభం అయింది. కానీ అధికారిక ప్రకటనకు మాత్రం చాలా సమయం తీసుకున్నారు.


త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో/టీజర్ కూడా విడుదల కానుంది. ఫిబ్రవరి 3వ తేదీన ఈ వీడియో విడుదల కానుందని సమాచారం. తమిళ నాట ఇండస్ట్రీ హిట్ అయ్యే చాన్స్ ఈ సినిమాకే ఉందని అంచనా. ఖైదీ, విక్రమ్‌లతో లోకేష్ క్రియేట్ చేసిన ‘LCU (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్)’లోనే ఈ సినిమా కథ కూడా జరగనుందని సమాచారం.


ఈ సినిమా క్యాస్టింగ్ గురించి కూడా ఇప్పటివరకు చాలా రూమర్లు వినిపించాయి. సంజయ్ దత్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడని తెలిసింది. విజయ్ ఈ సినిమాలో మధ్యవయస్కుడైన డాన్ పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. తనకి జోడిగా త్రిష కనిపించనుందని వార్తలు వస్తున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు మిస్కిన్, గౌతమ్ మీనన్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారని కోలీవుడ్ కోడై కూస్తుంది.


ఈ యూనివర్స్‌లో భాగం అయిన సూర్య, కార్తీ, కమల్ హాసన్‌లు కూడా విజయ్ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. అయితే మరోవైపు ఇందులో పాత యూనివర్స్ పాత్రలు ఉండవని, యూనివర్స్‌లో మరో కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుందని వార్తలు వస్తున్నాయి.


విజయ్ తర్వాతి సినిమాలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి నిజమేనా అని ఒక ఇంటర్వ్యూలో కార్తీని ప్రశ్నించగా అవునని, కాదని చెప్పకుండా సమాధానం దాటవేశాడు. అప్పట్నుంచి ఈ పుకార్లకు మరింత బలం వచ్చింది. ఈ సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో సాగుతుంది. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్‌నే రూ.300 కోట్ల వరకు పలుకుతాయని అంచనా వేస్తున్నారు. కేవలం అన్ని భాషల స్ట్రీమింగ్ రైట్స్ కోసమే నెట్‌ఫ్లిక్స్‌తో రూ.160 కోట్ల డీల్ కుదిరిందని వార్తలు వస్తున్నాయి.


ఇటీవలే ‘వారిసు (తెలుగులో వారసుడు)’తో తలపతి విజయ్ హిట్ అందుకున్నారు. అజిత్ కుమార్ ‘తునివు’తో పోటీ పడి కూడా ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కలెక్షన్లను అందుకుంది. ఏకంగా రూ.250 కోట్లకు పైగా వసూళ్లను ‘వారిసు’ అందుకుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు గానూ దిల్ రాజు విజయ్‌కు కెరీర్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలిసింది. ‘వారిసు’ సినిమాకు విజయ్ రూ.100 కోట్లకు పైగా అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి దిల్ రాజు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. ‘వారిసు’ విడుదలకు ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. తమిళంలో అజిత్ కంటే విజయ్ గొప్ప నటుడు అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు అజిత్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీంతో దిల్ రాజు టార్గెట్ గా ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. దిల్ రాజు ఎప్పుడూ ఇంతే ఏ సినిమా తీస్తే ఆ హీరో ను పొగుడుతూ ఉంటాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.