Vimanam Movie: బుల్లితెర మీద క్రేజీ యాంకర్లలో అనసూయ ఒకరు. అయితే సినిమా అవకాశాలు ఎక్కువ అవ్వడంతో ఇటీవలే జబర్దస్త్ ప్రోగ్రాం కూడా మానేశారు. పూర్తిగా సినిమాలకే తన సమయాన్ని కేటాయించారు. తాజాగా తను నటిస్తున్న ‘విమానం’ సినిమా నుంచి ‘సుమతి’ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో అనసూయ కొంచెం బోల్డ్ రోల్‌లో నటించనున్నట్లు ఈ సాంగ్ చూస్తే చెప్పవచ్చు.


‘సుమతి... నీ నడుములోని మడత చూస్తే ప్రాణమొణికె వనిత...’ అంటూ సాగే ఈ పాటని సంగీత దర్శకుడు చరణ్ అర్జునే రాసి పాడారు కూడా. అనసూయ కోసం రాహుల్ రామకృష్ణ పాడే పాటలా అనిపిస్తుంది. అనసూయని రాహుల్ రామకృష్ణ దూరం నుంచి చూడటం, పక్కన కూర్చుంటే సిగ్గుతో తలదించుకోవడం వంటి విజువల్స్ కూడా పాటలో చూడవచ్చు. జూన్ 9వ తేదీన తెలుగు, తమిళం భాషల్లో ఈ పాటను విడుదల చేశారు.



'విమానం' టీజర్‌ను కూడా ఇటీవలే విడుదల చేశారు. ఈ సినిమాలో సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ తండ్రీ కుమారులుగా నటించారు. ఆ ఇద్దరి ప్రయాణమే చిత్ర కథాంశమని టీజర్ చూస్తే తెలుస్తోంది. అన్నిటి కంటే ముఖ్యంగా తండ్రీ కుమారుల మధ్య సంభాషణలు, కుమారుడి మాటల్లో ఏమీ తెలియని అమాయకత్వం, స్వచ్ఛత ఎక్కువగా ఆకట్టుకుంటాయి. 


'నాన్నా... అమ్మ దేవుడి దగ్గరకు వెళ్లిందని చెప్పావ్ కదా! విమానం ఎక్కి దేవుడి దగ్గరకు వెళ్ళిందా?' అని కుమారుడు అడిగితే... 'అవును రా' అని తండ్రి చెబుతాడు. వెంటనే మరో ఆలోచన కూడా లేకుండా 'అమ్మ ఎంత గ్రేట్ నాన్నా' అని కుమారుడు అంటాడు. తండ్రి మాటలను అంతలా నమ్మేసే అమాయకత్వం ఆ చిన్నారిది. అప్పటి నుంచి విమానం ఎక్కించమని తండ్రిని అడుగుతూ ఉంటాడు. 'బాగా చదువుకుని, పెద్దోడు అయ్యాక నువ్వే ఎక్కొచ్చు' అని తండ్రి చెబుతూ ఉంటాడు. 


విమానం గురించి పిల్లల మధ్య సంభాషణలు సైతం భలే ఉన్నాయి. 'బస్సు నడిపే వాడిని డ్రైవర్ అంటాడు. లారీ నడిపే వాడినీ డ్రైవర్ అంటారు. మరి, విమానం నడిపే వాడిని ఎందుకురా పైలట్ అంటారు?' అని ధ్రువన్ అడిగితే... 'పైకి వెళ్ళాక లైట్ వేసుకుంటాడు కాబట్టి పైలట్ అంటార్రా' అని ఫ్రెండ్ ఆన్సర్ ఇస్తారు. 


'నాన్నా! దేవుడు ఎప్పుడు కనిపించినా దణ్ణం పెట్టుకోమంటావ్ ఏంటి నాన్నా' అని కుమారుడు అడిగితే... 'అడిగినవన్నీ ఇస్తాడు కాబట్టి' అని చెబుతాడు తండ్రి! ఆ తర్వాత కుమారుడు 'అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు, నాన్నా అంటారు' అని చెప్పే మాట హృదయాలు కదిలిస్తుంది చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. 


జీ స్టూడియోస్‌, కిర‌ణ్‌ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ సంస్థలు నిర్మించిన చిత్రమిది. దీనికి శివ ప్ర‌సాద్ యానాల ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ చిత్రానికి కళ : జె.జె. మూర్తి, కూర్పు :  మార్తాండ్ కె. వెంక‌టేష్‌, మాటలు : హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం), పాటలు : స్నేహ‌న్‌ (తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు), ఛాయాగ్రహణం : వివేక్ కాలేపు, సంగీతం : చ‌ర‌ణ్ అర్జున్‌.


Also Read బాలకృష్ణ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు భారీగా డిమాండ్ చేసిన తమన్నా - క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ