Sudigali Sudheer: 'జబర్ధస్త్' అనే కామెడీ షో ద్వారా పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్న కమెడియన్, నటుడు సుడిగాలి సుధీర్. బలగం మూవీ డైరెక్టర్ వేణు టీంలో చిన్న పాత్రగా పరిచయమైన సుడిగాలి సుధీర్.. ఆ తర్వాత తన టాలెంట్ తో టీం లీడర్ కూడా అయ్యాడు. అలా బుల్లితెరపై పలు షోలలో తన కామెడీతో, యాంకరింగ్ తో ప్రేక్షకులను అలరించిన ఆయన... ఇటీవలే బిగ్ స్క్రీన్ పైనా మెరవడం ప్రారంభించాడు. ఇప్పటికే పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన సుధీర్... హీరోగా ఇప్పటివరకు మూడు సినిమాలు చేశాడు. తాజాగా ఆయన మరో సినిమాకు ఓకే చెప్పారు. ఈ మూవీలో దివ్య భారతి హీరోయిన్ గా నటిస్తుందంటూ మహాతేజ క్రియేషన్స్ వెల్లడించింది.


హీరోగా సుడిగాలి సుధీర్ నాలుగో సినిమాకు నరేష్ కుప్పిలి దర్శకుడు. ఇంతకు ముందు విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. దర్శకుడిగా ఇది రెండో సినిమా. మహాతేజా క్రియేషన్స్, లక్కీ మీడియా సంస్థలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శుక్రవారం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది.  


Also Read : పదిహేను కోట్లు ఖర్చు పెట్టి రివేంజ్ తీర్చుకోవాలా? ‘మళ్ళీ పెళ్లి’పై నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్



దాదాపు తొమ్మిదేళ్ల పాటు 'జబర్ధస్త్' షో ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన సుడిగాలి సుధీర్.. ఆ సమయంలోనే‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’ సినిమాల్లో హీరోగా చేశాడు. కానీ అవి బాక్సాఫీస్ వద్ద అంతగా అలరించలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని 'గాలోడు' సినిమా ద్వారా ఆడియెన్స్ ను అలరించేందుకు వచ్చాడు. రొటీన్ కమర్షియల్ మాస్ మసాలా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం.. ముందు తీసిన సినిమాల కంటే కాస్త ఫరవాలేదనిపించింది. లాభాలు కూడా కాస్త బాగానే వచ్చినట్టు సమాచారం. 


Also Read :నేను ఏ తప్పూ చేయలేదు, క్లారిటీ ఎందుకు? - నాగ చైతన్యతో డేటింగ్‌పై శోభితా ధూళిపాళ


గతేడాది 'గాలోడు'తో థియేటర్లలో సందడి చేసిన సుధీర్.. ఆ తర్వాత మళ్లీ కనిపించకుండా పోయాడు. టీవీ షోల్లోనూ పెద్దగా ఎక్కడా కనిపించకపోవడంతో సుధీర్ ఏం చేస్తున్నాడంటూ ఆయన ఫ్యాన్స్ ఆలోచనల్లో పడిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. చాలా రోజుల తర్వాత తన నెక్స్ట్ మూవీతో సుధీర్ రాబోతున్నాడనే ప్రకటన వచ్చింది. అంతే కాదు ఈ మూవీలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హాట్ బ్యూటీ దివ్యభారతి హీరోయిన్ గా నటించనున్నట్టు చిత్ర నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు. అంతే కాదు ఆమెకు సంబంధించిన ఓ అఫిషియల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. 


తాజా ప్రకటనతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోను మరోసారి థియేటర్లలో చూడబోతున్నామంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఆయన సరసన దివ్య భారతి అని తెలుసుకున్న నెటిజన్లు.. సుడిగాలి మంచి ఛాన్స్ కొట్టేశాడని కామెంట్స్ చేస్తున్నారు. 


దివ్యభారతి విషయానికొస్తే.. మొదటి సినిమా 'బ్యాచిలర్' తో యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో చిత్రంగా ‘మధిల్ మెల్ కాదల్’ అనే తమిళ సినిమాలో నటించింది. ఇప్పుడు మూడో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మహాతేజా క్రియేషన్స్ అండ్ లక్కీ మీడియా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. కాగా ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.