తెలుగు సినిమా పరిశ్రమలో పలు మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కాయి. వాటిలో కొన్ని చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. ఎవర్ గ్రీన్ మూవీస్ గా నిలిచిపోయాయి. వాటిలో ఓ చిత్రం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’. 2013 సంక్రాంతి కానుక‌గా వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.  ఈ సినిమాలో మ‌హేశ్ బాబు, వెంక‌టేష్ హీరోలుగా న‌టించారు. స‌మంత‌, అంజ‌లి  హీరోయిన్లుగా న‌టించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా వ‌చ్చి ప‌దేళ్లు అవుతున్నా, ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ప్రేక్షకులు ఎగబడి చూస్తుంటారు.  ఈ సినిమాకు కల్ట్ అభిమానులున్నారు. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు, హీరోల నటన అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

  


‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సీక్వెల్ పై శ్రీకాంత్ అడ్డాల ఏమన్నారంటే?


తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కీలక విషయాలు వెల్లడించారు. దశాబ్దం క్రితం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందని నిర్మాత దిల్ రాజుకు వచ్చినట్లు చెప్పారు. అంతేకాదు, ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని దర్శకుడు శ్రీకాంత్ కు చెప్పారట దిల్ రాజు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. "ఈ మధ్యే దిల్ రాజు ఓసారి నాతో ఓ విషయం చెప్పారు. తెల్లవారు జామున 4 గంటలకు ఆయనకు ఓ ఐడియా వచ్చిందట. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సీక్వెల్ చేయాలి అనిపించిందట. అద్భుత విజయాన్ని అందుకున్న సినిమాకు పార్ట్-2 చేయాలి అన్నారు. దానికి నేను ఒకటే చెప్పాను. ఆ కాంబినేషన్ మరోసారి కుదరాలి. ఆ మూవీ క్రేజ్ అలాగే కొనసాగించాలంటే దానికి తగిన కథ కావాలి. కథ ఏమైనా రెడీ అయితే చెబుతానని అన్నాను" అని వెల్లడించారు.


తాజాగా ‘పెదకాపు 1’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో  ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సీక్వెల్ గురించి మాట్లాడారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల.  ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో సీక్వెల్ చేయగల కంటెంట్ ఉందన్నారు.  "’సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమా తీయడానికి ముందు ఒకటే ఆలోచించాను. ఓ మంచి ఫ్యామిలీని చూపించాలి. వారిలో మంచి ఆలోచనలు ఉండాలి. వారి గొప్ప సంస్కారం చూపించాలి అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. అక్కడి వరకే ఆ కథ అనుకున్నాను. చూపించాను. దానికి కొనసాగింపు ఉండాలని చెప్పారు దిల్ రాజు. నిజమే అనిపించింది” అన్నారు. అప్పట్లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమా తీయడానికి 4 సంవత్సరాలు పట్టిందని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారితోని ఈ సినిమా సీక్వెల్ చేయాలంటే సాధ్యం అవుతుందో? కాదో? అని అనుమానం వ్యక్తం చేశారు.


ఈనెల 29న ‘పెదకాపు 1’ విడుదల


విరాట్‌ కర్ణ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పెదకాపు 1’ సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ‘అఖండ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రావు రమేష్, ఆడుకల్లం నరేన్, అనసూయ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. 


Read Also: పండండి బిడ్డకు జన్మనిచ్చిన స్వర భాస్కర్‌- పేరు కూడా పెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial