తమిళ హీరో శివ కార్తికేయన్ (Sivakarthikeyan), 'జాతి రత్నాలు'తో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించిన దర్శకుడు కేవీ అనుదీప్ (KV Anudeep) కలిసి తెలుగు, తమిళ ద్విభాషా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో శివ కార్తికేయన్‌కు 20వ చిత్రమిది. అందుకని, #SK20 గా వ్యవహరిస్తున్నారు. తమిళనాడులోని కారైకుడిలో ఈ రోజు పూజా కార్యాక్రమాలతో సినిమా మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజే మొదలు పెట్టినట్టు తెలిపారు.


టాలీవుడ్‌లో టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి. శాంతి టాకీస్ నిర్మాణ భాగస్వామి. నారాయణ్ దాస్ కె. నారంగ్, సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మాతలు. కారైకుడిలో జరిగిన పూజా కార్యక్రమాల్లో హీరో, దర్శకుడితో పాటు నిర్మాతలు సురేష్ బాబు, పుస్కూర్ రామ్ మోహన్ రావు పాల్గొన్నారు. "నవ్వుల ప్రయాణం మొదలైంది" అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. శివ కార్తికేయన్‌తో ఆయనకు తొలి సినిమా ఇది.


గత ఏడాది విడుదలైన 'డాక్టర్', అంతకు ముందు 'సీమ రాజా', 'రెమో', 'శక్తి' చిత్రాలతో శివ కార్తికేయన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు. ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు.