తెలుగు, తమిళ, హిందీ సినిమా పరిశ్రమ అనే తేడా లేదు. ప్రతి చోటా నెపొటిజనం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే, బాలీవుగ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఈ నెపొటిజం వివాదం మరింత ముదిరింది. అంతేకాదు, బాలీవుడ్ లో నెపొటిజాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో బాయ్ కాట్ బాలీవుడ్ అనే క్యాంపెయిన్ జోరుగా కొనసాగింది. ఈ క్యాంపెయిన్ దెబ్బకు హిందీ చిత్ర పరిశ్రమలో అగ్రహీరోలుగా కొనసాగుతున్న వారి సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఘోర పరాజయం పాలైంది. ఈ పరాజయంతో ఆయన ఏకంగా సినిమాలకు కొంత కాలం విరామం ప్రకటించారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరుచుగా బాలీవుడ్ లో నెపొటిజంపై విమర్శలు సందిస్తూనే ఉంటుంది.


టాలీవుడ్ లోనూ నెపొటిజంపై చర్చ


తాజాగా టాలీవుడ్ లో నెపొటిజంపైనా కొంత చర్చ జరిగింది. అడవి శేష్ లాంటి వాళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్న నెపోటిజాన్ని కొద్ది కాలం క్రితం ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. తాజాగా నెపోటిజంపై నేచురల్‌ స్టార్‌ నాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా సోనీలైవ్‌ ‘నిజం విత్‌ స్మిత’ అనే టాక్ షోలో హీరో రానాతో కలిసి ఆయన పాల్గొన్నారు. త్వరలో స్ట్రీమింగ్ కు రానున్న ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఇందులో నాని, రానా నెపొటిజంపై స్పందించారు.  


నెపొటిజంపై నాని సంచలన వ్యాఖ్యలు


నెపొటిజంను పెంచి పోషిస్తున్నదే ప్రేక్షకులు అంటూ నాని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. “అసలు నెపోటిజంని పెంచి పోషిస్తుంది ప్రేక్షకులే. నాని డెబ్యూ మూవీ లక్షల్లో చూస్తే.. రామ్ చరణ్ డెబ్యూ మూవీ కోట్లలో చూశారు.  ఆ లెక్కన నెపోటిజాన్ని ప్రోత్సహిస్తుంది జనాలే కదా” అంటూ వ్యాఖ్యానించారు. అటు రానా ఇదే అంశంపైనా స్పందించారు.  ‘తల్లిదండ్రుల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది. పిల్లలు దాన్ని మరో స్థాయికి తీసుకెళ్లినప్పుడే వారు సక్సెస్‌ అయినట్లు” అని రానా చెప్పారు. వీరిద్దరిలో రానాకు బీభత్సమైన సినీ బ్యాగ్రౌండ్ ఉండగా, నాని ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. త్వరలో ఈ షో సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.






బాలయ్య షోతో పోటీగా స్మిత షో 


ప్రముఖ సింగర్‌ స్మిత ఈ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇటివలే ప్రారంభమైన ఈ షోలో మెగాస్టార్‌ చిరంజీవి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా ఈ నాని, రానా ఈ షోలో పాల్గొన్నారు.  బాలయ్య `అన్ స్టాపబుల్ విత్ ఎన్ బికె` అంటూ సెలబ్రిటీస్ టాక్ షోని ప్రారంభించారు. ఈ షో రెండో సీజన్ ఎండింగ్ ఎపిసోడ్ నాడే ‘నిజం విత్ స్మిత’ టాక్ షో మొదలయ్యింది. ఈ షో సైతం మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంటోంది.


Read Also: దట్టమైన అడవిలో కుక్కలతో పోరాటం, ఒళ్లు గగుర్పొడిచేలా ఆండ్రియా `నో ఎంట్రీ` ట్రైలర్