బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ చాలా రోజులుగా డేటింగ్ లో ఉన్నారనే విషయం తెలిసిందే. మొత్తానికి రూమర్లకు చెక్ పెట్టి ఈ జంట పెళ్లితో ఒక్కటైంది. దీంతో వారి అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ సూర్యగఢ్ ఫ్యాలెస్ హోటల్‌లో నిర్వహించిన వీరి పెళ్లి వేడుకకు భారీ సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. 4వ తేదీన మొదలైన వీరి పెళ్లి సందడి మంగళవారంతో ముగిసింది. సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖలు విచ్చేసి వధువరులను ఆశీర్వదించారు. 


పెళ్లికి ముందు మెహందీ, హల్దీ, సంగీత్ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. మెహిందీ ఫంక్షన్ లో కియారా-సిద్.. కాలా చష్మా, బిజిలీ, రంగిసారి, డిస్కో దీవానే, నాచ్నే దే సారే వంటి హిట్ పాటలకు చిందేశారు. కియారా సోదరుడు మిషాల్ ర్యాపర్, కంపోజర్ అనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్త జంట కోసం అతడు కంపోజ్ చేసి.. వినిపించిన సాంగ్ ఆకట్టుకుంది. కియారా మెహందీ ఫంక్షన్‌లో ఆర్టిస్ట్ వీణా నగ్దా మెహిందీ డిజైన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మనీష్ మల్హోత్రా, అర్మాన్ జైన్-అనిస్సా, షాహిద్ కపూర్-మీరా రాజ్ పుత్ కపూర్, కరణ్ జోహార్, నిర్మాత అశ్విన్ యార్డి, సింగర్ అంకిత్ తివారీలు ఈ వేడుకకు హాజరయ్యారు. 


ఈ బాలీవుడ్ కపుల్స్ పెళ్లికి కోట్లది రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ముంబైకి చెందిన ఓ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ ఆధ్వర్యంలో వీరి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. వీరి పెళ్లికి ఒక్క రోజే రూ.2 కోట్లు వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. 




పెళ్లికి సిద్ధమవడం కోసం సూర్యాఘర్ ప్యాలేస్‌లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. అక్కడే అంబరాన్ని తాకే పెళ్లి వేదికను ఏర్పాటు చేశారు. అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే, మీడియాను లోపలికి అనుమతించలేదు. దీంతో హోటల్ బయటే మీడియా హడావిడి చేసింది. పెళ్లికి వచ్చే వీవీఐపీల భద్రతను పర్యవీక్షించేందుకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు.


Also Read : స్టార్ హీరోలకు హిట్లు ఇచ్చిన బ్రహ్మానందం - ఆయన లేని ఈ సినిమాలను ఊహించుకోగలమా?


సూర్యఘర్ ప్యాలెస్ జైసల్మేర్ నుంచి 16 కి.మీ దూరంలో ఉంది. ఈ హోటల్ ను డిసెంబర్ 2010లో జైపూర్ కు చెందిన ఒక వ్యాపార వేత్త నిర్మించారు. దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హోటల్ జైసల్మేర్ లోని పసుపు రాళ్లతో నిర్మించారట. సూర్య కిరాణాలు ప్యాలెస్‌పై పడే విధంగా.. వెరైటీగా దీన్ని నిర్మించారు. ప్రపంచంలోనే బెస్ట్ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు వేదికగా ఈ ప్యాలెస్ పేరు గాంచింది. పెళ్లి రిసెప్షన్‌కు కూడా గ్రాండ్‌గా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. రిసెప్షన్ రెండు నగరాల్లో వేర్వేరు తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిసింది. మొదటగా సిద్ధార్థ్ మల్హోత్ర స్వస్థలమైన ఢిల్లీలో ఒక రిసెప్షన్ ఆ తర్వాత ముంబైలో మరొక రిసెప్షన్ ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. 


కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన 'భరత్ అను నేను' సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలో వసుమతి పాత్రతో ఆకట్టుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ' సినిమాలో నటించింది. తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అక్కడ వరుసగా అవకాశాలను అందిపుచ్చుకొని అక్కడే సెటిల్ అయింది. కియారా-సిద్దార్థ్ మల్హోత్రా కలసి ‘షేర్షా’ సినిమాలో తొలిసారి స్క్రీన్‌ పంచుకున్నారు.