బాలీవుడ్ హీరో సిద్థార్థ్ మల్హోత్రా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా ‘మిషన్ మజ్ను’. జనవరి 20వ తేదీన ఈ సినిమా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ‘స్పై థ్రిల్లర్‌’గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సాంగ్ లాంచ్ సమయంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.


భారతదేశం మీద ఆటంబాంబు ప్రయోగించడానికి పాకిస్తాన్ చేసే ప్రయత్నాలను అడ్డుకునే గూఢచారి పాత్రలో బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కనిపిస్తున్నాడు. పాకిస్తాన్‌లో స్థానికులతో కలిసిపోవడానికి తను పెళ్లి చేసుకునే పాకిస్తానీ యువతి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కనిపించనుంది. సిద్ధార్థ్ మల్హోత్రా మిషన్‌కు భారత గూఢచారి సంస్థ RAW పెట్టిన పేరు ‘మిషన్ మజ్ను’. దాన్నే సినిమా టైటిల్‌గా పెట్టారు.


ఈ చిత్రాన్ని 1970 దశాబ్దం నాటి ప్రేమకథతో రూపొందించారు. దేశభక్తి, ప్రేమ వంటి అంశాలతో తెరకెక్కించిన ఈ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రా భారత గూఢచారి ఏజెంట్‌ పాత్ర లో కనిపించనున్నారు. ముందు ఈ సినిమాను థియేటర్ లలో విడుదల చేయాలి అని అనుకున్నారు. అయితే అనేక వాయిదాల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు శాంతను బాగ్ఛీ దర్శకత్వం వహించగా.. రోనీ స్క్రూవాలా, అమర్ బుటాలా, గరిమా మెహతాతో కలిసి నిర్మించారు.


ఈ సినిమాను థియేటర్ లో కాకుండా డైరెక్ట్ ఓటీటీ కి ఇవ్వడంతో చర్చ మొదలైంది. ఈ మధ్యకాలంలో నార్త్ ఆడియన్స్ లో ఇలాంటి కంటెంట్ పట్ల ఏర్పడుతున్న వ్యతిరేకతే దీనికి కారణమని తెలుస్తోంది. నటీనటులు, ట్రైలర్‌లను చూసి ప్రేక్షకులు థియేటర్ లకు కూడా రావడం లేదు. అందుకే ‘మిషన్ మజ్ను’ బాగున్నా బాగోకపోయినా సినిమాను థియేటర్ లో చూస్తారో లేదో అనే భయంతో నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ కు ఓకే చేశారని విశ్లేషకులు అంటున్నారు. ఈ సినిమా హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది.