బాక్సాఫీస్ దగ్గర వందల కోట్లు వసూలు చేసే సత్తా కన్నడ సినిమాకు ఉందని, దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలు కన్నడ చిత్రసీమకు ఉందని 'కెజియఫ్', 'కెజియఫ్ 2', 'విక్రాంత్ రోణ', 'కాంతార' చిత్రాలు ప్రూవ్ చేశాయి. దాంతో కన్నడలో పాన్ ఇండియా సినిమాల నిర్మాణం ఎక్కువ అయ్యింది. కన్నడ అగ్ర కథానాయకులు ఇతర భాషల ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు.  


కరుణడ చక్రవర్తి డాక్టర్ శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) కథానాయకుడిగా రూపొందుతోన్న పాన్ ఇండియా ఫిల్మ్ 'ఘోస్ట్' (Ghost Movie). బెంగళూరులో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆరు కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన జైల్ సెట్‌లో ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు.


దీపావళి సందర్భంగా 'ఘోస్ట్' సినిమాలో శివ రాజ్ కుమార్ ఇంటెన్స్ లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని దర్శక - నిర్మాతలు తెలిపారు. చేతిలో గన్, చుట్టూ బుల్లెట్స్ వర్షం, మధ్యలో శివ రాజ్ కుమార్... దీపావళి పోస్టర్ ఆయన అభిమానులను ఆకట్టుకుంటోంది.  


నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా నటించిన 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలో శివ రాజ్ కుమార్ అతిథిగా కనిపించారు. శతకర్ణుడి కథను వివరించే పాత్రను ఆయన పోషించారు. రామ్ గోపాల్ వర్మ 'కిల్లింగ్ వీరప్పన్' సినిమా చేశారు. ఆయన సినిమాలు కొన్ని తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. ఈ 'ఘోస్ట్' సినిమాతో ఆయన పాన్ ఇండియా మార్కెట్ మీద దృష్టి పెట్టారు. 'కెజియఫ్', 'కాంతార' విజయాలు, ఆ చిత్రాలకు ఇతర భాషల్లో వచ్చిన వసూళ్లు మిగతా కన్నడ హీరోలకు ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పవచ్చు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలతో పాన్ ఇండియా సినిమాలకు శ్రీకారం చుడుతున్నారు.   


Shiva Rajkumar's Ghost Movie Shooting Update : ''ప్రస్తుతం జైల్ సెట్‌లో చిత్రీకరణ చేస్తున్నాం. అందులో  24 రోజుల పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ప్లాన్ చేశాం. నవంబర్ 10వ తేదీకి మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. డిసెంబర్‌లో రెండో షెడ్యుల్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది'' అని 'ఘోస్ట్' చిత్ర బృందం తెలిపింది.


Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?






కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో 'ఘోస్ట్' సినిమాను భారీ  ఎత్తున విడుదల చేసే విధంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి కన్నడ హిట్ సినిమా 'బీర్బల్' ఫేమ్ శ్రీని దర్శకత్వం వహిస్తున్నారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మస్తీ, ప్రసన్న విఎం మాటలు రాస్తున్నారు. 'కెజియఫ్' ఫేమ్ శివ కుమార్  కళా దర్శకుడిగా పని చేస్తున్నారు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. మహేంద్ర సింహ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.