కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు, శాండిల్‌వుడ్ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar) తాజా సినిమా 'వేద'. కర్ణాటకలో గత ఏడాది డిసెంబర్ 23న కన్నడ వెర్షన్ థియేటర్లలో విడుదల అయ్యింది. తెలుగు వెర్షన్ మొన్న శుక్రవారం (ఫిబ్రవరి 9న) 'శివ వేద'గా థియేటర్లలోకి వచ్చింది. 


విచిత్రం ఏమిటంటే... 'శివ వేద' విడుదలైన రాత్రే 'జీ 5' ఓటీటీలోకి వీక్షకులకు సినిమా అందుబాటులోకి వచ్చింది. ఇంకేముంది? ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చుని సినిమా చూసే అవకాశం ఉన్నప్పుడు థియేటర్లకు ఎవరు వస్తారు? ముందు నుంచి ఊహించినట్టుగా ఆ ప్రభావం గట్టిగా పడింది.


నిర్మాతకు 50 - 75 లక్షలు నష్టం!
'శివ వేద' తెలుగు థియేట్రికల్ హక్కులను కొన్న రేటు కంటే తెలుగు నాట పబ్లిసిటీకి మూడు నాలుగు రేట్లు ఖర్చు అయినట్లు తెలిసింది. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణను ముఖ్య అతిథిగా రాగా... గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు. దానికి శివ రాజ్ కుమార్, గీత దంపతులతో పాటు చిత్ర బృందంలో కీలక సభ్యులు విచ్చేశారు. వాల్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ప్రమోషన్స్, యాడ్స్ వగైరా వగైరా చాలా ఖర్చు చేశారు. థియేటర్లకు రెంట్లు కట్టారు. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం మీద నిర్మాతకు సుమారు 50 - 75 లక్షల రూపాయలు నష్టం రావచ్చని ఒక అంచనా. నిజానికి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రావడం, తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత చేసిన పబ్లిసిటీ కారణంగా 'శివ వేద' గురించి ప్రేక్షకులకు తెలిసింది. సినిమా గురించి సెర్చ్ చేశారు. అది 'జీ5'కు హెల్ప్ అయ్యింది. సినిమా ఓటీటీలో విడుదలైనప్పుడు ఎక్కువ మంది చూడటానికి కారణమైంది.
 
ఎనభై థియేటర్ల నుంచి ఎనిమిదికి!
తెలుగు రాష్ట్రాల్లో సుమారు 80 థియేటర్లలో 'శివ వేద' విడుదల చేశారు. దాంతో ఇప్పుడు థియేటర్ల సంఖ్య ఎనిమిదికి పడింది. దీంతో నిర్మాతకు తీవ్రంగా లాస్ వచ్చింది. ఓటీటీలో సినిమా విడుదల కానుందనే వార్త ప్రేక్షకులకు తెలియడంతో తొలి రోజు కూడా థియేటర్ల దగ్గర స్పందన ఆశించిన రీతిలో లేదు. అసలు, రాత్రికి ఓటీటీలో వచ్చేటప్పుడు థియేటర్లలో విడుదల చేయడం ఎందుకు? అని ముందు నుంచి సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నించారు. 


కోర్టుకు వెళ్ళిన తెలుగు నిర్మాత ఎంవీఆర్ కృష్ణ
'వేద'ను శివ రాజ్ కుమార్ భార్య గీత, జీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను నిర్మాత ఎంవీఆర్ కృష్ణకు 'జీ స్టూడియోస్' సంస్థే విక్రయించింది. ఒకవైపు తెలుగు హక్కులను అమ్మేసి, మరో వైపు ఓటీటీలో విడుదల చేసింది.
 
'జీ 5' ఓటీటీలో విడుదల చేసే ఆలోచన ఉన్నప్పుడు థియేట్రికల్ హక్కులను అమ్మడం ఎందుకు? ఈ ప్రశ్న రావడం ఎవరికైనా సహజం. తెలుగులో చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాత, కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ అధినేత ఎంవిఆర్ కృష్ణను 'ఏబీపీ దేశం' సంప్రదించినప్పుడు ''జీ స్టూడియోస్ వర్గాలతో తాము మాట్లాడినప్పుడు 30 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుందని చెప్పారు. మేం ఓటీటీలో విడుదలకు 30 రోజులు టైమ్ ఉందని అనుకున్నాం. అగ్రిమెంట్‌లో కూడా ఆ మాట ఉంది. అయితే... 30 రోజులకు ముందు ఓటీటీ అనే పదం పేర్కొనలేదు. మాటల్లో ఒకటి చెప్పారు. చేతల్లో మరొకటి చూపించారు. వాళ్ళు చేసిన పని వల్ల నాకు భారీ నష్టాలు వచ్చాయి'' అని చెప్పారు. విడుదలకు రెండు మూడు రోజుల ముందు ఆయన కోర్టుకు వెళ్ళగా... ఓటీటీ అని లేని కారణంగా కేసును కొట్టేశారు.  


చర్చలు జరుపుతున్న జీ స్టూడియోస్!
జీ స్టూడియోస్, జీ 5 మధ్య జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన రాత్రికి ఓటీటీలో సినిమా వచ్చింది. 9వ తేదీ రాత్రికి సినిమా ఓటీటీలో వస్తుందని నాలుగైదు రోజుల ముందు... 6వ తేదీన తనకు తెలియజేసినట్టు నిర్మాత ఎంవీఆర్ కృష్ణ వివరించారు. 7వ తేదీన కోర్టులో కేసు వేయగా, 9న హియరింగ్ కి వచ్చింది. ఇప్పటికీ జీ స్టూడియోస్ తరఫున ప్రతినిధులు తనతో చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు.


Also Read : నారా, నందమూరి కుటుంబాలకు ఎన్టీఆర్ దూరమా? చెక్ పెట్టిన బ్రాహ్మణి, ప్రణతి
 
థియేట్రికల్ విడుదలకు జీ స్టూడియోస్ నుంచి క్లియరెన్స్ తనకు 7వ తేదీ రాత్రి వచ్చిందని నిర్మాత ఎంవీఆర్ కృష్ణ తెలిపారు. క్లియరెన్స్ వచ్చిన మూడు రోజుల్లో ఓటీటీలో ఎలా విడుదల చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ అంశం మీద మరోసారి కోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారట. ఈ వ్యవహారంలో శివ రాజ్ కుమార్ అండ్ ప్రొడక్షన్ హౌస్‌కు ఏ విధమైన సంబంధం లేదని ఎంవీఆర్ కృష్ణ తెలిపారు. ఆయన కూడా ఈ విధంగా జరగడం పట్ల విచారం వ్యక్తం చేశారని, భవిష్యత్తులో తమకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినట్టు వివరించారు. 


Also Read : భోళా శంకరుడితో దర్శకేంద్రుడు - చిరు సెట్స్‌లో స్పెషల్ మూమెంట్