యంగ్ హీరో శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడట. ఇన్నాళ్లు పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. ప్రభాస్ తర్వాతే అని శర్వానంద్ చెప్పేవాడు. అయితే, ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకొనేలా లేడని.. ఇంట్లోవాళ్లు కంగారు పెట్టారో ఏమో.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోడానికి సిద్ధమైనట్లు సమాచారం.


అమ్మాయి ఎవరో తెలుసా?


ప్రస్తుతం నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్న శర్వానంద్.. తన పెళ్లి గురించి అడిగితే స్పందించేవాడు కాదు. శర్వా తాజాగా బాలయ్య టాక్ షో ‘అన్ స్టాపబుల్ సీజన్ 2’కు గెస్టుగా వచ్చాడు. అక్కడ కూడా బాలయ్య నుంచి శర్వానంద్ కు పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురయ్యింది. కానీ, ఆయన ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశాడు. ప్రభాస్ తర్వాతే పెళ్లి అని సమాధానం ఇచ్చాడు. తాజాగా శర్వానంద్ పెళ్లికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అమ్మాయి ఎవరు? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. తాజాగా ఆ ఉత్కంఠకు తెరపడింది.   


ఈ నెల 26న రక్షితరెడ్డితో ఎంగేజ్ మెంట్?


శర్వానంద్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని కట్టుకోబోతున్నాడట. ఈమె పేరు రక్షిత రెడ్డి. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుందట. అధికారిక ప్రకటన రాకపోయినా ఈ నెల 26న వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు తెలుస్తోంది. రక్షితరెడ్డి తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అని తెలిసింది. అంతేకాదు, ఆమె ఏపీ మాజీ మంత్రి  బొజ్జల గోపాల కృష్ణ మనువరాలని సమాచారం.  అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న రక్షిత, కరోనా విజృంభణ తర్వాత ఇండియాకు వచ్చిందట. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ ఫ్రం హోమ్ చేస్తుందని తెలిసింది. ఇంతకీ శర్వానంద్ ఆ అమ్మాయిని ఎక్కడ కలిశాడు? వీరిది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా?  అనే విషయం మాత్రం బయటకు తెలియదు. అటు శర్వానంద్ పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతున్నా, ఇప్పటికీ ఈ విషయంపై శర్వానంద్ ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇరు కుటుంబాల నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.


రెండు సినిమాల్లో నటిస్తున్న శర్వానంద్


ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే, ముందుగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి మెప్పించాడు. ఆ తర్వాత మంచి కథలు సెలక్ట్ చేసుకుని హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత మంచి కమర్షియల్ హీరోగా ఎదిగాడు. గత ఏడాది ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆ సినిమా కంటే ముందు వరుసగా 5 ఫ్లాపులను ఎదుర్కొన్నాడు.  ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు. మరికొన్ని సినిమా కథలు వింటున్నట్లు తెలుస్తోంది. 






Read Also: ఆస్కార్ కు ‘ఆల్ దట్ బ్రీత్స్’ నామినేట్, ఈ డాక్యుమెంటరీ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?