Shah Rukh Khan On His Familys Struggle in Recent Years: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నారు. గత ఏడాది ఆయన నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. ‘పఠాన్’,’జవాన్’, ‘డంకీ’ చిత్రాలు హ్యాట్రిక్ హిట్ అందుకున్నాయి. ‘జవాన్’, ‘పఠాన్’ సినిమాలు ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నాయి. ‘డంకీ’ మాత్రం ఆ స్థాయిలో సాధించకపోయినా, ఫర్వాలేదు అనిపించింది.  


కొంత మంది ఇడియట్స్ దారుణ విశ్లేషణలు చేశారు!


తాజాగా ఓ జాతీయ చానెల్ ఆయనను ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డుతో సత్కరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన కుటుంబ గత కొద్ది సంవత్సరాలుగు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, వాటి నుంచి తను నేర్చుకున్న పాఠాల గురించి వెల్లడించారు. గత నాలుగైదు సంవత్సరాల్లో తాను, తన కుటుంబ చాలా కష్టలను ఎదురు చూసినట్లు చెప్పారు. “గత నాలుగు, ఐదు సంవత్సరాలు నాకు, నా కుటుంబానికి ఎన్నో సవాళ్లను పరిచయం చేశాయి. నా సినిమాలు చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. చాలా మంది విశ్లేషకులు నా సినీ కెరీర్ ముగిసి పోయిందంటూ వార్తలు రాశారు. కొంతమంది ఇడియట్స్ మరీ దారుణంగా విశ్లేషణలు చేశారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.   


వ్యక్తిగత విమర్శలు బాధ కలిగించాయి!


తప్పుడు విశ్లేషణల పట్ల బాధ పడకపోయినా, కొన్నిసార్లు ఇబ్బంది కలిగించాయని షారుఖ్ వెల్లడించారు. “నా సినిమాల గురించి వచ్చే విశ్లేషణల విషయంలో పెద్దగా బాధపడలేదు. కానీ, వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించే అసహ్యకరమైన రాతలు మనసుకు బాధను కలిగించాయి. అయినప్పటికీ వాటి గురించి నేను ఏనాడు బయట చెప్పలేదు. సైలెంట్ గా నా పని నేను చేసుకుంటూ వెళ్లాను. ఇప్పుడు మళ్లీ సక్సెస్ బాట పట్టాను. మళ్లీ అందరూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో కష్ట సుఖాలు కామన్ గా ఉంటాయని, కష్టాల్లో ఉన్న వ్యక్తిని చూసి చులకనగా మాట్లాడకూడదని షారుఖ్ చెప్పారు. “ప్రతి మనిషి జీవితంలో ఇబ్బందులు వస్తుంటాయి, పోతుంటాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ ముందకు సాగాలి. మనపని కచ్చితంగా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. ఇదే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను” అన్నారు.


నా కుటుంబం ఎంతో అండగా నిలిచింది!


“అవార్డులు అనేవి ప్రతి వ్యక్తిలో ఉత్సాహాన్ని నింపుతాయి. మరింత బాధ్యతగా ఉండాలని గుర్తు చేస్తుంటాయి. నాకు వచ్చిన ‘ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2023’ అవార్డును నా కుటుంబానికి అంకితం ఇస్తున్నాను. కొద్ది సంవత్సరాల క్రితం నాకు అవార్డులు వచ్చినప్పుడు వాటిని నా పిల్లలకు బహుమతిగా ఇవ్వాలి అనుకున్నాను. అది వాళ్ల జీవితంలో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. గత 5 సంవత్సరాలుగా నా కుటుంబం నాకు ఎంతో అండగా నిలిచింది. అందుకే ఈ అవార్డును నా ఫ్యామిలీకి అంకితం చేయాలి అనుకుంటున్నాను” అని షారుఖ్ చెప్పుకొచ్చారు.


Read Also: బుల్లితెరపై నాగార్జున సంక్రాంతి సందడి - బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో అక్కినేని ఆట అదుర్స్