Sharukh Khan's Jawan Teaser : ఇటీవలే పఠాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లేటెస్ట్ చిత్రం 'జవాన్' పై ఓ క్రేజీ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ టీజర్ ను జూలై 7న విడుదల చేయనున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ మూవీకి తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. 


'పఠాన్' తర్వాత 'జవాన్' మూవీ టైటిల్ రివీల్ అయినప్పట్నుంచి ఈ సినిమాపై షారుఖ్ ఫ్యాన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వార్తల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 'జవాన్' సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నారు, టీజర్, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హల్ చేస్తోన్న జవాన్ టీజర్ కు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


జవాన్ టీజర్‌ని షారూఖ్‌, అట్లీలు గ్రాండ్‌గా లాంచ్‌ చేస్తారని, ఇది ఆల్ టైమ్‌లో అతిపెద్ద డిజిటల్ లాంచ్ కానుందని సమాచారం. టీజర్ అందర్నీ ఆకట్టుకుంటుందని, మునుపెన్నడూ లేని విధంగా ఇందులో షారూఖ్ ఖాన్ కనిపిస్తారని తెలిసింది. ‘జవాన్’ టీజర్‌ను చెన్నైలో లాంచ్ చేయడానికి మేకర్స్.. ఓ స్పెషల్ గెస్ట్ ను తీసుకురావాలని చూస్తున్నారని, అది ఖరారైన వెంటనే, మూవీ రిలీజ్ డేట్, టీజర్ తేదీని ప్రకటిస్తారట. సమాచారం ప్రకారం జవాన్ టీజర్ జూలై 7 న విడుదలయ్యే అవకాశం ఉంది.


ప్రస్తుతం వైరల్ అవుతోన్న వార్తల ప్రకారం 'జవాన్' టీజర్ అందరూ అనుకుంటున్న జూలై 7న రిలీజ్ అయితే.. ఆ లాంచ్ తర్వాత పాటలు, ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్టు సమాచారం. అనంతరం ఈ యాక్షన్ చిత్రం 2 నెలల పాటు మార్కెటింగ్ ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తుందని టాక్ వినిపిస్తోంది. “జవాన్ సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది. సరిగ్గా జూలై 7న ప్రచారం ప్రారంభమవుతుంది. పఠాన్ తర్వాత, షారుక్ ఖాన్ మరో బ్లాక్ బస్టర్ అందించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు" అని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.


'జవాన్' సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. SRK నటించిన ఈ చిత్రం 2023లో విడుదలైన అతిపెద్ద చిత్రాలలో ఒకటిగా పేరు తెచ్చుకోనుందని ఆయన ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.


షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జనవరిలో 'పఠాన్‌'తో ప్రపంచవ్యాప్తంగా రూ. 1050 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. భారతదేశంలో రూ. 525 కోట్ల నెట్‌తో షారుఖ్.. భారీ బ్లాక్‌బస్టర్‌ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.


Read Also : Prithvi Raj Accident: నొప్పితో పోరాడుతున్నా - యాక్సిడెంట్‌పై షాకింగ్ న్యూస్ చెప్పిన ‘సలార్’ నటుడు పృథ్వీ రాజ్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial