ప్రముఖ దర్శకుడు, నటుడు సతీష్ కౌశిక్  మృతి హిందీ చిత్ర పరిశ్రమతో పాటు యావత్ దేశ సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ తెలిపారు. ముంబైలో జరిగిన అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న ఆయన.. సతీష్ భౌతిక కాయాన్ని చూడగానే బోరున ఏడ్చేశారు. కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. తీవ్ర ఉద్వేగానికి గురైన సల్మాన్.. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోడానికి చాలా ప్రయత్నించారు. ఈ సందర్భంగా సల్మాన్ సతీష్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఎల్లప్పుడూ తనను ఎంతో ప్రేమగా ఉండేవారని తెలిపారు. ఆయన లేని లోటు తనకు కెరీర్ పరంగా, వ్యక్తిగతంగా తీరనిదన్నారు.


అభిమానుల అశృనయనాల నడుమ అంత్యక్రియలు


పోస్ట్ మార్టం, ఇతరత్రా కార్యక్రమాలు పూర్తైన తర్వాత ఢిల్లీ నుంచి ముంబైకి సతీష్ కౌశిక్ పార్థీవ దేహాన్ని తరలించారు. ముంబైలో సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులు అర్పించిన తర్వాత అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో  బాలీవుడ్ కి చెందిన స్టార్ సెలబ్రిటీలు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, రణబీర్ కపూర్, కంగనా రనౌత్, మధుర్ భండార్కర్, షెహనాజ్ గిల్, నీనా గుప్తా, ఇషాన్ ఖట్టర్, ఫర్హాన్ అక్తర్, జావేద్ అక్తర్, సంజయ్ కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ, అభిషేక్ బచ్చన్, జానీలీవర్, రాకేష్ రోషన్, బోనీ కపూర్ పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు సతీష్ ఇంటికి చేరుకుని నివాళులు అర్పించారు. అనంతరం  సతీష్ కౌశిక్ అంత్యక్రియలు నిర్వహించారు.






గుండెపోటుతో కన్నుమూత


గుండెపోటుతో నిన్న(గురువారం)  సతీష్ కౌశిక్ కన్నుమూశారు. ఆయన వయసు 66 ఏళ్లు. సతీష్ కౌశిక్ మృతిని తొలుత  ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ బయటకు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.  ఢిల్లీ శివార్లలోని ఆయన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కౌశిక్, అక్కడ ఓ ముఖ్యమైన సమావేశంలో పాల్గొన్నారు. తిరిగి ఢిల్లీకి వస్తుండగా ఆయనకు కారులోనే గుండె పోటు వచ్చింది. వెంటనే ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఆయనను బతికించేందుకు డాక్టర్లు చాలా ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. అందరినీ విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.  






ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించిన సతీష్


సతీష్ కౌశిక్ స్వస్థలం హరియాణాలోని మహేంద్రఘడ్‌. ఆయన 1956 జన్మించారు. హిందీ సినిమా 'మాసూమ్' (1983) ద్వారా నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలకు మాటలు రాశారు. దర్శకత్వం వహించారు. అనుపమ్ ఖేర్, ఆయన కలిసి కొన్ని చిత్రాలు నిర్మించారు. 'మిస్టర్ ఇండియా', 'దీవానా మస్తానా', 'బ్రిక్ లేన్', 'రామ్ లఖన్', 'సాజన్ చలే ససురాల్' తదితర చిత్రాల్లో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ 'ఛత్రివాలి'లో కూడా సతీష్ కౌశిక్ కనిపించారు.  సతీష్ కౌశిక్ నటించిన 'ఎమర్జెనీ' ఇంకా విడుదల కావాల్సి ఉంది.  అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన 'రూప్ కి రాణి చారోన్ కి రాజా' సినిమాతో సతీష్ కౌశిక్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సల్మాన్ ఖాన్, భూమిక జంటగా నటించిన 'తేరే నామ్' దర్శకుడు కూడా ఆయనే. సుమారు 15 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన తీసిన చివరి సినిమా 'కాగజ్'.


Read Also: ‘ఉ అంటావా’ పాటకు అక్షయ్, నోరా ఫతేహీ డ్యాన్స్ - బన్నీ, సామ్‌లను దింపేశారుగా, ఇదిగో వీడియో