బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా జనాల ముందుకు తీసుకురాలేని దబాంగ్ హీరో.. వచ్చే ఏడాది ఈద్ సందర్భంగా థియేటర్లలో సందడి చేయనున్నట్లు వెల్లడించారు. ‘టైగర్-3’ సినిమా రిలీజ్ డేట్‌ను సల్మాన్ సోమవారం ప్రకటించి..  అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన పొడుగుకాళ్ల సుందరి కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను ఏప్రిల్ 21, 2023లో విడుదల చేయనున్నట్లు సల్మాన్ వెల్లడించాడు.  
 
టైగర్-3 విడుదలకు సంబంధించి ఇన్ స్టాలో ఓ వీడియోను సల్మాన్ రిలీజ్ చేశారు. ‘టైగర్’ సీక్వెల్ లో గతంలో వచ్చిన సినిమాలను చూపిస్తూ.. ‘టైగర్’ మళ్లీ రాబోతుంది అని ప్రకటించారు. పదేళ్ల ‘టైగర్’ వేడుకకు సిద్ధమవుదాం అని చెప్పారు. “టైగర్ ప్రయాణం కొనసాగుతోంది. 2023 ఈద్ రోజున టైగర్-3 కోసం సిద్ధంగా ఉండండి. ఏప్రిల్ 21న మీకు దగ్గర లోని బిగ్ స్క్రీన్ మీద మాత్రమే YRF50తో ‘టైగర్3’ వేడుకను జరుపుకోండి’’ అంటూ ప్రకటించాడు. ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతుంది.

  


అటు ఆగస్టు 15తో ‘టైగర్’ ఫ్రాంచైజీకి 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చిత్రం మొదటి భాగం ‘ఏక్ థా టైగర్’ ఆగస్టు 15, 2012న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించింది. ఈ ఫ్రాంచైజీ  రెండవ భాగం ‘టైగర్ జిందా హై’ 2017లో విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ సాధించింది. వచ్చే ఏడాది ముచ్చటగా మూడో భాగం విడుదల కాబోతుంది. ‘టైగర్-3’ పేరుతో జనాల ముందుకు రాబోతున్న ఈ సినిమా లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, అవినాష్ సింగ్ రాథోడ్, జోయా హుమైని పాత్రలను తిరిగి పోషించబోతున్నారు. 


కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలు పోషించారు. కబీర్ ఖాన్ చివరిగా దర్శకత్వం వహించిన రణవీర్ సింగ్ '83' విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాను  ఆదిత్య చోప్రా కు చెందిన యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సంస్థ సినీ ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఐదు దశాబ్దాల కాలంలో ఈ నిర్మాణ సంస్థ నుంచి ఎన్నో అద్భుత చిత్రాలు తెరకెక్కాయి.