విశ్వనటుడు కమల్ హాసన్ కి 'విక్రమ్' లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం తలపతి విజయ్తో 'లియో' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ బిగ్ ప్రాజెక్ట్స్ లో 'లియో' కూడా ఒకటి. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే తారస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్గా నటిస్తోంది. సుమారు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ విజయ్ - త్రిష కాంబో సెట్ అవడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.


అలా రీసెంట్ టైమ్స్ లో 'లియో' మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ రోల్ చేయబోతున్నారనే వార్త సినిమాపై ఒక్కసారిగా హైప్ ని పెంచేసింది. ఈ వార్త ఒక్కసారిగా నెట్టింట వైరల్ అవడంతో మెగా ఫ్యాన్స్ సైతం తెగ ఖుషీ అయ్యారు. అయితే తాజా సమాచారం ప్రకారం 'లియో' సినిమాలో రామ్ చరణ్ ఎటువంటి గెస్ట్ రోల్ చేయడం లేదనే వార్త ఒకటి బయటకు వచ్చింది. అవును, రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తున్నారనే వార్త పూర్తిగా అవాస్తవమట. ఇటీవల రామ్ చరణ్ స్వయంగా లోకేష్, విజయ్ లను లంచ్ కి ఆహ్వానించారని, అందుకు ఇద్దరూ అంగీకరించారనే వార్త సోషల్ మీడియాలో రావడంతో 'లియో' సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారనే ప్రచారానికి బలం చేకూరింది.


అయితే లోకేష్, విజయ్ ఇద్దరూ రామ్ చరణ్ ఇంటికి లంచ్ కి ఎప్పుడు వస్తారనే విషయం ఇంకా తెలియదు. కానీ 'లియో' సినిమాలో రామ్ చరణ్ ఎటువంటి గెస్ట్ రోల్ లో నటించడం లేదని కోలీవుడ్ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ 'లియో'లో రామ్ చరణ్ నటించడం లేదనే వార్త మాత్రం వైరల్ అవుతుంది. కాగా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని సెవెన్ స్టూడియోస్ సంస్థ సుమారు రూ.250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సినిమాలో విజయ్ కి తండ్రి పాత్రలో సంజయ్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.


రీసెంట్ గానే సంజయ్ దత్ లియో షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఇక సంజయ్ దత్ తోపాటు అర్జున్, గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ, మిస్కిన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన ఫస్ట్ సింగిల్ భారీ రెస్పాన్స్ని అందుకుంది.  'నా రెడీ' అంటూ సాగే ఈ పాట ఇప్పటికే యూట్యూబ్లో 50 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే కేవలం తమిళ వర్షన్ సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలోనే తెలుగు వెర్షన్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19 ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది.


Also Read : షారుక్ 'జవాన్' పై దిల్ రాజు భారీ పెట్టుబడి?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial